దుర్గగుడిలో చేతివాటం.. విరాళం కాజేసిన ఉద్యోగి

by  |
దుర్గగుడిలో చేతివాటం.. విరాళం కాజేసిన ఉద్యోగి
X

దిశ, ఏపీ బ్యూరో: పవిత్ర పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో అధికారుల తీరు మారడం లేదు. ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినా మిగిలిన వారిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా రికార్డ్ అసిస్టెంట్ తన చేతివాటం ప్రదర్శిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రకీలాద్రిపై డొనేషన్ కౌంటర్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా ఉమామహేశ్వరరావు పనిచేస్తున్నారు. అమ్మవారికి ఓ భక్తుడు రూ. 10,116 విరాళాన్ని అందజేశాడు. అయితే నగదు తీసుకున్న ఉమా మహేశ్వరరావు దాతకు కేవలం 100 రూపాయలకే రసీదు ఇచ్చాడు. దీంతో ఆ దాత నేరుగా దుర్గగుడి ఈవో భ్రమరాంబను కలిశాడు. తాను ఇచ్చిన డొనేషన్‌కి బాండ్ కావాలని కోరాడు. దీంతో ఈవో అసలు విషయంపై ఆరా తియ్యగా చేతివాటం బట్టబయలైంది. దీంతో రికార్డు అసిస్టెంట్ ఉమామహేశ్వరరావును ఈవో భ్రమరాంబ సస్పెండ్ చేశారు. బిల్ బుక్‌లో కార్బన్ తప్పించి రసీదు రాసినట్టు ఈఓ గుర్తించారు. గతంలో కూడా ఉమామహేశ్వర ఇలాంటి పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed