ఫేస్బుక్ వేదికగా సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఆగ్రహం

by  |
Vijayashanti Facebook
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న తెలంగాణ సర్కార్ కుప్పకూలితేనే ప్రజలకు మంచిరోజులు వస్తాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. శుక్రవారం ఫేస్ బుక్ వేదికగా ప్రభుత్వంపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు దారుణంగా కుప్పకూలుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కీలకమైన భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.

భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌రావు ఈ మధ్య స్పందిస్తూ… గత ప్రభుత్వాలు భూములు అమ్మగా లేంది… మేం చేస్తే తప్పా? అని అడిగారని, ఆ సర్కార్లు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలూ ఎండగట్టాయని, అదే తప్పు మీరు చేస్తే, అది రైటెలా అవుతుందని ప్రశ్నించారు?. ఈ అవకతవక రెవెన్యూ విధానాలతో పాటు తెలంగాణలో కుప్పకూలుతున్న మరొక వ్యవస్థ ఉన్నత విద్యా రంగం అన్నారు.

మొన్నటి వరకూ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పిందని ఈ విషయమై రాష్ట్ర సర్కారుకు స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో అంశం ఈ వర్శిటీలను తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత అని, దాదాపు 3 వంతుల పోస్టులు (2,152) ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను ఈ సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చన్నారు. సుమారు 1000 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ల కిందటే నిర్ణయం తీసుకున్నా నేటికీ భర్తీ చేయలేదని, విద్యావ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రభుత్వం తీరుమార్చుకొని ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు.



Next Story

Most Viewed