ఈ నెల 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ

by  |
ఈ నెల 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ
X

ముంబయి: దేశవాళీ వన్డే క్రికెట్ కాంపిటేషన్ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ ఆదివారం సమాచారం అందించింది. ఈ ట్రోఫీలో పాల్గొనే జట్లన్నీ వాళ్లకు కేటాయించిన వేదికకు 13న చేరుకోవాలని, అప్పట్నుంచీ ఆరు రోజులపాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని వెల్లడించింది. క్వారంటైన్‌ సమయంలోనే కొవిడ్ టెస్టులు చేయనున్నట్టు పేర్కొంది. ఇటీవలే విజయవంతంగా నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మాదిరిగానే ఈ ట్రోఫీనీ 6 వేదికల్లో జరపాలని చూస్తోంది. జట్లను ఆరు గ్రూపులుగా విభజించి, సూరత్, ఇండోర్, బెంగళూరు, జైపూర్, కోల్‌కతాతోపాటు తమిళనాడులోని ఓ స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ నెల 20 నుంచి మార్చి 1వరకు లీగ్ దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత మరోసారి ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచి, టెస్టులు చేస్తారు. వీటి అనంతరం మార్చి 8న నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అదే నెల 11న సెమీఫైనల్స్, 14న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. కాగా, గత విజయ్ హజారే ట్రోఫీని కర్నాటక జట్టు గెలుచుకుంది.

Next Story

Most Viewed