కోవిడ్‌-19ను జయించాం

by  |
కోవిడ్‌-19ను జయించాం
X

దిశ, వెబ్‌డెస్క్ : కోవిడ్ 19(కరోనావైరస్)తో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. వియత్నాం ధైర్యాన్నిస్తున్నది. ఆ దేశంలో కోవిడ్ 19 సోకినవారందరూ సురక్షితంగా బయటపడ్డారు. మూడు నెలల పాప మొదలు 73 ఏళ్ల వృద్ధుడు కూడా ఈ వైరస్ ముప్పు నుంచి తప్పించుకున్నారు. వియత్నాంలో 16 మందికి కోవిడ్ 19 సోకింది. బుధవారం నాటికి వీరందరిని నయం చేసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వియత్నాం ప్రకటించింది. ‘కోవిడ్ 19ను ఎదుర్కోవడం ఒక యుద్ధమైతే.. మేం అందులో గెలిచాం’ ఆ దేశ ఉపప్రధాని వు దుక్ దామ్ అన్నారు. అయితే, ఈ వ్యాధి ఎప్పుడు తిరగబెట్టేది చెప్పలేం కాబట్టి అప్రమత్తత అలాగే కొనసాగుతుందని చెప్పారు.

ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రాథమిక విధానాలనే ఉపయోగించామని ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ గుయెన్ తాన్ లాంగ్ తెలిపారు. ‘ముందు వైద్యులు ఈ వైరస్ లక్షణాలను జ్వరంగా ట్రీట్ చేయాలి. కచ్చితమైన పౌష్టికాహారం అందించాలి. పేషెంట్ బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి’ అనే సూత్రాలను పాటించినట్టు వివరించారు. వీటితో పాటు వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ వైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించినప్పటి నుంచి చురుకుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే వియత్నం వైరస్‌ను జయించిందని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా.. దేశంలో పాఠశాలలను మూసివేశారు. చైనా నుంచి రాకపోకలను నిషేధించారు. అలాగే, ఇరాన్, ఇటలీ నుంచి వచ్చేవారిని ప్రత్యేక అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారు. ఎగుమతులు, దిగుమతులపైనా ఆంక్షలు విధించారు. వన్యప్రాణుల ఎగుమతులు, అక్రమ రవాణా ఈ దేశం నుంచి ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయమున్నది. అయితే, వీటి ఎగుమతి, దిగుమతులపై వియత్నాం తాత్కాలికంగా నిషేధం విధించింది.



Next Story

Most Viewed