భారత ఆటగాళ్లు విక్టరీతో తిరిగొచ్చారు

by  |
భారత ఆటగాళ్లు విక్టరీతో తిరిగొచ్చారు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకొని ముంబయిలో అడుగుపెట్టినప్పు చేసిన సందడి గుర్తుందా? విదేశీ గడ్డపై జరిగిన మెగా టోర్నీలో విజేతలై ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే ముంబయిలో క్రికెటర్లను ఊరేగించారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియం వరకు ఒకటే కోలాహలం. సరిగ్గా అలాంటి ఘన స్వాగతమే టీమ్ ఇండియా క్రికెటర్లకు లభించింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకొని ఇండియా వచ్చిన క్రికెటర్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇంతకు ముందు కూడా అక్కడ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచారు. కానీ ఈ సారి గాయాలతో సీనియర్లు దూరమైన వేళ జూనియర్లే జట్టును విజయపథంలో నడిపించిన తీరు, గబ్బాలో రికార్డులు సాధించడంతో ఈ ఆసీస్ పర్యటన వరల్డ్ కప్ అంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో దిగిన క్రికెటర్లను సాదరంగా ఆహ్వానించారు.

ముంబయిలో సన్మానం..

టీమ్ ఇండియా కెప్టెన్ అజింక్య రహానే, కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్విషాలు ముంబయిలో దిగారు. అక్కడి చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ పాటిల్, ఇతర సభ్యులతో పాటు బీసీసీఐ అపెక్స్ కమిటీ సభ్యులు అజింక్య నాయక్, అమిత్ దాని, ఉమేష్ ఖాన్‌విల్కా వారిని ఘనంగా సన్మానించారు. ముందుగా రహానే కేక్ కట్‌ చేసి విజయోత్సవాన్ని ప్రారంభించాడు. అనంతరం క్రికెటర్లను సన్మానించారు. ఇక గబ్బా టెస్టు హీరో రిషబ్ పంత్ ఢిల్లీలో దిగాడు. అక్కడ పంత్‌కు ఘన స్వాగతం పలికిన డీడీసీఏ అధికారులు అతడిని సన్మానించారు. విమానాశ్రయాలకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చినా.. కరోనా ఆంక్షల కారణంగా ఎవరినీ క్రికెటర్ల వద్దకు రానివ్వలేదు.

ఇంటికి చేరిన నటరాజన్..

ఆసీస్ పర్యటనకు కేవలం నెట్‌బౌలర్‌గా వెళ్లిన నటరాజన్.. ఒకే సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్ అందరి మన్ననలు చూరగొన్నాడు. ఐపీఎల్‌లో ఉన్నప్పుడే నటరాజన్‌కు కొడుకు పుట్టాడు. కానీ ఆస్ట్రేలియా వెళ్లడంతో చూసుకోలేక పోయాడు. గురువారం ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు చేరుకున్న నటరాజన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సేలంలోని ఇంటికి చేరుకున్నాడు చేరుకున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇంకా దుబాయ్‌లోనే ఉన్నారు. తర్వాత విమానానికి వాళ్లు చెన్నై చేరుకోనున్నారు. మిగిలిన క్రికెటర్లు అందరూ తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో అభిమానులు, స్థానికులు, బంధువుల వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి స్వాగత సత్కారాలను చూడని క్రికెటర్లు.. ఈ అనుభవానికి ఉబ్బితబ్బిబవుతున్నారు.

Next Story

Most Viewed