‘మా భూములు ఆక్రమించుకున్నారు’

by  |
‘మా భూములు ఆక్రమించుకున్నారు’
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కోతులారం గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ భూములను హైదరాబాద్‌కు చెందిన కొందరు ఆక్రమించుకున్నారని ఆర్డీఓ ఎదుట వాపోయారు. కోతులారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.233,237,238,239 లోని వీరమళ్ళ నర్సింహా, పందుల పెంటయ్య, కుమ్మరి బుచ్చాలు తదితర బాధిత రైతుల భూములను హైదరాబాద్‌‌లో ఉండే కొందరు వాళ్ల పేరుపై భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని విలపించారు. తమకు చదువురాక ఇన్నేళ్లుగా భూమిని పట్టా చేయించుకోలేదని, మా తాత ముత్తాతల నుంచి ఏన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్నామని తెలిపారు. మా భూమి మాకు ఇప్పించాలని లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందారు. గ్రామంలో రైతుల వ్యవసాయ భూములను, దారులను, దేవాదాయ భూములను హైదరాబాద్‌లో ఉండే ఒకే కుటుంబం కబ్జా చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల జాయింట్ కలెక్టర్, ఆర్దీఓకు వినతిపత్రం అందజేశారు. దీంతో బుధవారం నల్లగొండ ఆర్దీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో దేశ్యానాయక్ తదితర సిబ్బంది గ్రామానికి విచ్చేసి కబ్జాకు గురైన భూములను పరిశీలించి భాదిత రైతులతో మాట్లాడారు.

అధైర్య పడొద్దు, న్యాయం చేస్తాం : ఆర్దీఓ జగదీశ్వర్ రెడ్డి

నల్లగొండ ఆర్దీఓ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల వాదనలు, ఇతరుల వాదనలు విన్నామని రైతులకు అన్యాయం జరిగింది అనే వాస్తవాన్ని గుర్తించామని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు రైతులు ఎవరూ చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడొద్దని, సంయమనం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాజుల సుజాత, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed