సిద్దిపేట జిల్లాకు మళ్లీ ఆయనే!

by  |
సిద్దిపేట జిల్లాకు మళ్లీ ఆయనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా మళ్ళీ వెంకట్రామిరెడ్డి నియమితులయ్యారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరిని సిద్దిపేట కలెక్టర్‌గా నియమించింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో మళ్ళీ వారిద్దరినీ యధావిధిగా పాత స్థానాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల కలెక్టర్‌లు ఇంతకాలం అదనపు బాధ్యతలు నిర్వహించడంతో తాజా బదిలీలతో అవన్నీ పూర్వ స్థితికి చేరుకున్నాయి.

సంగారెడ్డి నుంచి వెంకట్రామిరెడ్డి బదిలీ కావడంతో ఆ స్థానంలో ఇంతకాలం మెదక్ జిల్లా బాధ్యతలు చూసిన హనుమంతరావును నియమించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చూస్తారు. ఇదిలా ఉండగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న వాసం వెంకటేశ్వర్లును ప్రధాన కార్యదర్శి బదిలీ చేశారు. ఇంకా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కొత్త కలెక్టర్ నియమితులయ్యేంత వరకు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్‌గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మొహంతి పూర్తి అదనపు బాధ్యతలతో పర్యవేక్షిస్తారు. సిద్దిపేట ఎన్నికలు పూర్తయిన తర్వాత యధావిధిగా వెంకట్రామిరెడ్డి కలెక్టర్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Next Story