అధికారుల నిర్లక్ష్యమే..పుట్‌పాత్‌ల ఆక్రమణకు సాక్ష్యం !

by  |
అధికారుల నిర్లక్ష్యమే..పుట్‌పాత్‌ల ఆక్రమణకు సాక్ష్యం !
X

దిశ, మేడ్చల్: పుట్‌పాత్‌ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పరిహాసమో తెలీదు కానీ నార్మల్ పీపుల్స్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పుట్‌పాత్‌లను చిరు, బడా వ్యాపారులు ఆక్రమిస్తుండటంతో పాదాచారులు రోడ్డుపై నడుస్తూ యాక్సిడెంట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా ఉండట్లేదు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీల్లో రోడ్డు పక్కన నిర్మాణాలు చేపడితే సెట్‌బ్యాక్ కింద 30గజాలు వదలాల్సి ఉంటోంది. కానీ కొందరు అధికారులకు పైసలు ముట్టజెప్పి పనులు చేసుకుంటుండగా, మరికొందరు మాకు ఉందే 120గజాలు ప్లేస్ వదిలితే మాకేం మిగులుతుందని కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎవరైన అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. వారే కోర్టు ఆర్డర్స్ చూపి ఎదురు ప్రశ్నిస్తున్నారు.

పుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు

జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో పుట్‌పాత్‌లు రాత్రికి రాత్రే మాయం అవుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విపరీతంగా ధరలు ఉండడం.. ఉన్న కొద్ది స్థలానికి మరికొంత ప్లేస్ యాడ్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. నిజాంపేట, మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కీసర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు రోడ్లమీదికొచ్చేశాయి. నేరేడ్‌మెట్ నుంచి మిర్జాలగూడ వరకు ప్రధాన రహదారి, ఆనంద్‌బాగ్, ఎన్ఎఫ్‌ఫ్సీ, సఫిల్‌గూడ, హనుమాన్‌పేట్, అల్వాల్, శంషీర్‌గూడలో ప్రధాన రోడ్లన్నీ అక్రమ నిర్మాణాలతో మూసుకుపోయాయి. కొన్నిచోట్ల షాపులు, మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు పుట్‌పాత్‌లను ఆక్రమించుకున్నాయి.

రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ఆలోచన లేకపోవడమే కాకుండా అధికారులు పట్టించుకొనే ధోరణి చూపకపోవడంతో రహదారికి ఇరువైపులా నిబంధనలు అతిక్రమిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య అవసరాలకు 100 నుంచి 200 గజాల ప్లాట్లలో సైతం సెల్లార్లు, అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు. ఒక్కటౌన్ ప్లానింగ్ విభాగంలోనే నిత్యం రూ.లక్షలు ముడుపుల వ్యవహారాలు బహిరంగంగానే నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్లపైనే సంతలు

కూరగాయల సంత లేదన్న చింత పోయి ఇప్పుడు కొత్త చిక్కు మొదలయ్యింది. కూరగాయాలు కొనేందుకు దూరం వెళ్లాలన్నా బాధ తప్పిందనుకోవాలో లేక అంగడి దుకాణాలతో ప్రతివారం ఇబ్బందులు ఎదుర్కొవాలో తెలియని పరిస్థితి స్థానికులకు నెలకొంది. సంతల ఏర్పాటుకు మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇస్తుండటంతో రోడ్లపైనే దుకాణాలు పెడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారు, రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags: GHMC, Medchal, Putpath occupation, petty traders, Big merchants, Nizampet, Medchal, Malkajgiri, Kukatpally, Quthbullapur, Keesara

Next Story

Most Viewed