మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో టీకా ఉచితం

by  |
మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో టీకా ఉచితం
X

ముంబై: మహారాష్ట్ర, రాజస్తాన్ ప్రభుత్వాలు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులోని పౌరులకు ఉచితంగా టీకా ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులవారికి టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 45ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ఉచితంగా టీకా ఇస్తుందని తెలుపుతూ మిగతావారికీ టీకా వేయడాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ తమ ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య పౌరులకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తుందని వెల్లడించారు.

14 నుంచి 15 కోట్ల టీకాలను సమీకరిస్తామని, ఇందుకోసం గ్లోబల్ టెండర్ వేస్తామని తెలిపారు. రాష్ట్రాలకు టీకా ధరలు కేంద్రానికంటే ఎక్కువగా ఫిక్స్ చేయడంపై మండిపడ్డారు. సీరం ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రూ. 150కే టీకా డోసులను సరఫరా చేస్తుండగా రాష్ట్రాలకు రూ. 400 వసూలు చేయనుందని తెలిపారు. కొవాగ్జిన్ కూడా అదే దారిలో వెళ్లిందని, రాష్ట్రాలకు మరింత అధికంగా రూ. 600లకు విక్రయించడానికి ధరను ప్రకటించిందని చెప్పారు.

రాజస్తాన్ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. 18ఏళ్లు పైబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఇందుకోసం తమ ప్రభుత్వం రూ. 3000 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వమే ఈ టీకాలను ఉచితంగా పంపిణీ చేయడం సరైన చర్య అని, తద్వారా రాష్ట్రాల బడ్జెట్‌పై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed