కొలువులిచ్చే సంస్థలోనే పోస్టుల్లేవ్.. ఏండ్లుగా ఖాళీలు

by  |
tspsc
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొలువులు భర్తీ చేసే టీఎస్​పీఎస్సీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏండ్ల నుంచి ఈ పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్​లో పెడుతున్నారు. ఇప్పటికే టీఎస్​పీఎస్సీలో పాలకవర్గం లేదు. కేవలం ఒక్క సభ్యుడే సాయిలు ఉండగా.. ఆయన్ను ఇంఛార్జీ ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. పాలకవర్గం గడువు తీరిపోయినా నియామక ప్రక్రియను చేపట్టడం లేదు. అయితే ఇందులో పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు.

165లో 90 మందే

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నుంచి టీఎస్​పీఎస్సీకి 128 మంది ఉద్యోగులు అలాట్​ చేయగా.. చాలా పోస్టులను అప్​గ్రేడ్​ చేశారు. ఆ తర్వాత కిందిస్థాయిలో కేడర్​ స్ట్రెంత్​ను భర్తీ చేయడం లేదు. అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్లు, జూనియర్​ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్ల విభాగాల్లో పోస్టులన్నీ దాదాపుగా ఖాళీ ఉన్నాయి. ప్రస్తుత వివరాల ప్రకారం 165 మంది కేడర్​ స్ట్రెంత్​ ఉండాల్సి ఉండగా… రెగ్యులర్​ ఉద్యోగులు 82 మంది, మరో 8 మంది ఔట్​సోర్సింగ్​ సిబ్బందితో కలుపుకుని 90 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పటి వరకు ప్రక్రియను కూడా మొదలుపెట్టడం లేదు. దీంతో పనిభారం పెరుగుతుందంటున్నారు.

150 మందిని ఇవ్వండి

టీఎస్​పీఎస్సీ తొలినాళ్లలో టీఎస్​పీఎస్సీకి ఉద్యోగులు ఎంతమంది కావాలంటూ ప్రభుత్వం నివేదిక అడిగింది. కమిషన్​ కార్యాకలాపాలు సాగించేందుకు అదనంగా 150 మంది సిబ్బంది కావాలంటూ నివేదిక ఇచ్చారు. ఏ విభాగంలో ఎంతమంది కావాలనే అంశాలను వివరించారు. కానీ ప్రభుత్వం నుంచి రిప్లై రాలేదు. అయితే ఫైళ్లు పెండింగ్​లో ఉండటంతో పాటు పలు కారణాలతో టీఎస్​పీఎస్సీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు పంపింది. 150 మందిలో కనీసం 75 మందిని నియమించాలని కోరింది. కానీ ప్రభుత్వం దీన్ని కూడా పక్కనేసింది.

ముగ్గురు జాయింట్​ సెక్రెటరీలు ఏమైంది..?

పబ్లిక్​ సర్వీస్​కమిషన్​లో ప్రస్తుతం సెక్రెటరీ వాణీప్రసాద్​ఉండగా.. ఉన్నతస్థాయిలో ఇద్దరు అడిషనల్ సెక్రెటరీలు, ఐదుగురు డిప్యూటీ సెక్రెటరీలు, 10 మంది అసిస్టెంట్​ సెక్రెటరీలు ఉన్నారు. అయితే ఉద్యోగాల భర్తీ చేసే కమిషన్ కావడంతో.. పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనికోసం ముగ్గురు జాయింట్​సెక్రెటరీలు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ముందుగా ప్రభుత్వం కూడా ఒకే చెప్పింది. ముగ్గురు జాయింట్​సెక్రెటరీలు అవసరమని, దానికి ఆమోదం కూడా తెలిపింది. కానీ నియామకంలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కొలువుల భర్తీ ప్రక్రియలో వేగం పెంచాలంటే కచ్చితంగా ముగ్గురు జాయింట్​ సెక్రెటరీలు అవసరమని, ప్రస్తుతం భారీగా కొలువులు భర్తీ చేయాల్సిందిగా సీఎం ప్రకటించిన నేపథ్యంలో వీటిని ముందుగా భర్తీ చేయాలని విన్నవిస్తూనే ఉన్నారు. కానీ ఈ ఫైల్​ను ప్రభుత్వం పక్కనేసింది. ముగ్గురు జాయింట్​సెక్రెటరీల భర్తీ అడుగు ముందుకు పడటం లేదు.

Next Story