ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం : వీహెచ్

by  |
ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం : వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని పీసీసీ మాజీ చీఫ్​ వీ హనుమంతరావు సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను బొంద పెడతాడా, కాళ్లకింద నలిపేస్తా అంటూ ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం సరికదాన్నారు. కేసీఆర్​ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉపఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నాడని, మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతా అని చెప్పిన సీఎం కేసీఆరే మెడలు వంచుకుని వచ్చాడని ఎద్దేవా చేశారు. జీహెచ్​ఎంసీలో మేయర్ లేదా డిప్యూటీ మేయర్ మైనార్టీలకు ఇచ్చేవారని, ఇప్పుడు దాన్ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని మండిపడ్డారు.

మళ్లీ మోసానికి కుట్ర : రాములు నాయక్​

నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక ఉండడంతో నల్గొండ, నాగార్జున సాగర్​ ప్రజలకు మళ్లీ మోసం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలోనే ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్​ ప్రారంభించిందని, జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే చాలా లిఫ్ట్​లు ప్రారంభించారన్నారు. ఏడేళ్లు నిద్రపోయిన సీఎం ఇప్పుడు మాట్లాడుతున్నాడని, గ్రావిటీ ద్వారా పారే నీళ్లకు ఎత్తిపోతలు నిర్మిస్తున్నారని, అలాగైతేనే సీఎంకు కమీషన్లు వస్తాయని విమర్శించారు. గిరిజనుల గురించి కుక్కలంటూ మాట్లాడారని, కేసీఆర్​కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాములు నాయక్​ అన్నారు.


Next Story

Most Viewed