బండి మీద కులం పేరుంటే సీజ్!

by  |
బండి మీద కులం పేరుంటే సీజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ సమాజంలో వేళ్లూనుకుపోయిన కులవ్యవస్థ గురించి తెలియంది కాదు. ఈ వ్యవస్థను రూపుమాపితేనే సమసమాజ స్థాపన సాధ్యమని, ఓవైపు సంఘ సంస్కర్తలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా దేశంలో రోజురోజుకూ కుల రాజకీయాలు మరింత పటిష్ఠమవుతూనే ఉన్నాయి. పలువురు ‘తమది పలానా సామాజిక వర్గం’ అని బహిరంగంగా చెప్పుకుంటూ గొప్పలు పోతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కొందరు సొంత కార్లు, బైకులు, ఇతర వాహనాలపై తమ కులాన్ని ప్రతిబింబించే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. యూపీలో అయితే వాహనాల నెంబర్ ప్లేట్లు, అద్దాలు, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ స్టిక్కర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే యూపీ రవాణా శాఖ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. వెహికల్స్‌పై ‘కులం’ తెలిపే స్టిక్కర్లు వేస్తే.. సదరు వాహనాలను సీజ్ చేస్తోంది.

యూపీలో బైక్‌లు, కార్లు, ఎస్‌యూవీలపై ‘యాదవ్, జాట్, గుజ్జర్, బ్రాహ్మణ్, పండిట్, క్షత్రియ, లోధి, మౌర్య’ వంటి సామాజిక వర్గాల స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతుండటాన్ని మహారాష్ట్రకు చెందిన హర్షల్ ప్రభు అనే టీచర్ గమనించాడు. ఇలా తమ సామాజిక వర్గాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ఇది సమాజంలో విభజనను తీసుకొస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎఓ)కు లెటర్ రాశాడు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం యూపీ రవాణా శాఖకు పలు నిబంధనలు రూపొందించి పంపించింది. ఇలాంటి వెహికల్స్ ట్రాక్ చేయడం కోసం ఓ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది.

కాగా పీఎంఓ సూచనల మేరకు యూపీ రవాణాశాఖ ప్రస్తుతం ఓ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. స్టిక్కర్ల ద్వారా కులాన్ని ప్రదర్శించే వాహనాలను సీజ్ చేస్తోంది. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తనిఖీలో ప్రతి 20 వాహనాల్లో ఒకదానిపై స్టిక్కర్ ఉంటోందని, వెహికల్స్‌పై కులం తెలిపే స్టిక్కర్లు అంటించొద్దని కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి తెలిపారు.


Next Story