యాసంగిలో వరి సాగు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఉత్తం కుమార్

by  |
యాసంగిలో వరి సాగు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఉత్తం కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయం పై ఆంక్షలు పెట్టడం సరికాదని, యాసంగిలో రైతులు వరి సాగు చేయాలని ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై మీడియా, పార్టీ శ్రేణులతో జూమ్​ మీటింగ్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్​ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. బీజేపీ, టీఆర్​ఎస్​ పార్టీలు ప్రాథమిక బాధ్యతలను విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దని, పామాయిల్​ వేసుకోవాలని చెప్పుతున్నాడని, అసలు పంటల గురించి వ్యవసాయ శాఖ మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.

పామాయిల్​ లాంగ్​ టర్మ్​ పంట అని, రైతులు పెట్టుబడులు పెట్టి ఏండ్ల తరబడి ఏం చేయాలన్నారు. వరి రైతులకు కాంగ్రెస్​ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం ధాన్యం రోడ్లపై ఉందని, వర్షాలతో మొలకలు వస్తున్నాయని, రోడ్డుపై ధాన్యం కొనుగోలు చేయకుండా రబీ ధాన్యం గురించి కేసీఆర్​ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ఉత్తమ్​ ప్రశ్నించారు.

రోజుల కొద్దీ వరి ధాన్యం కల్లాల్లో ఉండడంతో రైతులు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరి తప్ప మరో పంట పండని భూములను రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. కేంద్రంపై యుద్ధం చేసే ముందు వర్షాకాల వడ్లు కొనుగోలు చేయాలని సీఎం ను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం ప్రకటించి చాలా సార్లు యూ టర్న్‌ తీసుకున్నారని, భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే కుట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు.

వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదని భట్టి హెచ్చరించారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమో ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా లేవన్నారు. ధాన్యం తరలించే ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆక్షేపించారు. షరతులు లేకుండా పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని శ్రీధర్‌ బాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ తదితరులు ఉన్నారు.

ఈ నెల 27 నుంచి వరి దీక్ష

ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 ఇందిరాపార్క్ దగ్గర వరి దీక్ష చేపడతామని టీపీసీసీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ నేతలకు సూచనలిచ్చారు.


Next Story

Most Viewed