మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం

by  |
మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలు అమలయ్యాయి. అయితే, గతేడాది మాదిరిగా దేశవ్యాప్తంగా కాకపోయినా ఇప్పటికే 20కి పైగా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో మరోసారి నిరుద్యోగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ విపరీతంగా ఉండటం, మరోవైపు ఆంక్షల విధింపుతో లక్షల ఉద్యోగాలు పోయాయి. గత నెల చివరి వారంలో పట్టణ నిరుద్యోగం 9.55 శాతంగా నమోదవగా, ఈ నెల మొదటి వారానికి ఏకంగా 11.72 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి.

ఇది ఏప్రిల్‌లో నమోదైన 9.78 శాతం కంటే అధికం. అలాగే, దేశ నిరుద్యోగ రేటు గతవారం నాటికి 8.67 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగ రేటు 7.29 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉండటం వల్లనే నిరుద్యోగం పెరుగుతోందనుకోలేమని, ఆర్థిక కోణం వైపు నుంచి కూడా పరిశీలించాలని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆర్థికవ్యవస్థ పనితీరు కార్మిక, ఉపాధితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. మెరుగైన ఆర్థిక పునరుద్ధరణ కోసం భారత్ మహమ్మారి నుంచి ఎంత తొందరగా బయటపడగలదనే దాన్ని బట్టి ఉంటుందని ఆర్థికవేత్త సునీల్ కుమార్ చెప్పారు. కాగా, గతేడాది ఇదే సమయంలో దేశ నిరుద్యోగ రేటు 24 శాతంగా ఉంది. పట్టణ నిరుద్యోగం 27.83 శాతంగా నమోదైనట్టు సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయి.

Next Story