కేసీఆర్ ప్రేమ పేదలపై కాదు.. కుటుంబం, MIMపైనే

by  |
కేసీఆర్ ప్రేమ పేదలపై కాదు.. కుటుంబం, MIMపైనే
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తొలుత జీడిమెట్లలో రోడ్ షో అనంతరం శాలిబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయకుండా కేసీఆర్ అందరినీ రోడ్డుపై నిలబెట్టారని, కానీ మోడీ పేదల అకౌంట్లలో డబ్బులు వేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు పేదలపై ప్రేమ లేదని, కేవలం ఆయన కుటుంబం, ఎంఐఎం పార్టీపైనే ఉందన్నారు.

యూపీలో మూడేళ్ల కాలంలోనే బీజేపీ పార్టీ 35లక్షల పేదలకు ఇళ్లు నిర్మించిందని, కేసీఆర్ తన ఆరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్ని గృహాల నిర్మాణం చేపట్టారో చెప్పాలన్నారు. ఈ తెలంగాణ కోసమా విద్యార్థులు చనిపోయిందని విమర్శించారు. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారు, మహిళలపై జరిగిన అత్యాచారాలు మర్చిపోయారా? అని ప్రజలను ప్రశ్నించారు. హిందూస్తాన్ అనని వాళ్లతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని యోగి మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సాయాన్ని టీఆర్‌ఎస్ నేతలు జేబులో వేసుకున్నారని, అందుకే కేంద్రం వరద సాయన్ని అకౌంట్లో వేయలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ప్రభుత్వం హిందూవుల కోసమే ఆలోచించడం లేదని, దేశంలోని ముస్లిం మహిళల రక్షణ కోసం కూడా చర్యలు చేపట్టిందన్నారు. అందుకోసమే ట్రిపుల్ తలాక్ రద్దు చేసి వారికి సరైన న్యాయం, రక్షణ కల్పించామన్నారు. మోడీ దేశ ప్రజల రక్షణ కోసం నిత్యం ఆలోచిస్తున్నారని, వ్యాక్సిన్ పురోగతిపై సమీక్షిస్తున్నారని గుర్తుచేశారు. కావున, వచ్చే ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రేటర్ వాసులకు యోగి పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed