యూపీలో కొత్త కేబినేట్.. ఎన్నికల ముందు భారీ మార్పులు

by  |
యూపీలో కొత్త కేబినేట్.. ఎన్నికల ముందు భారీ మార్పులు
X

లక్నో: యూపీలో ఆదివారం కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి వర్గంలో కొత్తగా ఏడుగురికి చోటు దక్కింది. మరో కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ కూర్పు జరిపినట్టు సమాచారం. ముఖ్యంగా కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రి వర్గ విస్తరణ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాల వారికి మంత్రి వర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పించేలా సీఎం యోగీ ఆధిత్యనాథ్ ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ మంత్రి వర్గంలో జితిన్ ప్రసాద్( బ్రహ్మణ) మినహా మిగతా వారు వెనకబడిన కులాలకు చెందిన వారు కావడం గమనార్హం. కొత్తగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న వారిలో ఓబీసీ(3), ఎస్సీ(2), ఎస్టీ(1)లు ఉన్నారు. కేబినెట్‌లో ఓబీసీల నుంచి ధర్మవీర్ ప్రజాపతి, చత్రపాత్ గంగ్వార్, సంగీత బల్వంత్, షెడ్యూల్ కులాల నుంచి జాతవ్ పల్తూరామ్, సోంకర్ దినేశ్ ఖతిక్‌లు స్థానం దక్కించుకున్నారు.

కాగా రాష్ట్రంలో 13శాతం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద్‌కు మంత్రి పదవి ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న బలరాం పూర్, హస్తీనాపూర్ నియోజక వర్గాల నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు జాతవ్ పల్తూరామ్, సోంకర్ దినేశ్ ఖతిక్‌లకు అవకాశం కల్పించినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. మరో వైపు ఓబీసీలో అధిక శాతం జనాభా కలిగిన కుర్మీ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు చత్రపాల్ గంగ్వర్, తూర్పు యూపీలో అధికంగా ఉన్న నిషాద్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన తొలిసారి ఎమ్మెల్యే సంగీత బల్వంత్‌లకు మంత్రి వర్గంలో చోటు కల్పించారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా నూతన మంత్రులతో గవర్నర్ ఆనంది బెన్ పటేల్ రాజ్ భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయించారు.


Next Story