చుక్కా.. ముక్కా.. పాఠశాలలో ఎంచక్కా..!

by  |
చుక్కా.. ముక్కా.. పాఠశాలలో ఎంచక్కా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో ఘోరం జరిగింది. కొందరు తాగుబోతులు పాఠశాలను పానశాలగా మార్చుకున్నారు. డజను బీరు సీసాలతో దర్జాగా పార్టీ చేసుకున్నారు. ముక్కా, చుక్కాతో రాత్రంతా ఎంజాయ్ చేసుకున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల పల్లెలో అనుకుంటే పొరపడినట్టే.ఎంతో చైతన్యవంతమైన, ఉద్యమాల పురిటి గడ్డ కర్విరాల కొత్తగూడెంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేసింది.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు స్కూల్ కు రావడం లేదు. కానీ ఆన్ లైన్ క్లాసులు జరగుతున్నాయి. ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి సాయంత్రం వరకు ఆన్ లైన్ క్లాసులు బోధించి వెళ్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు రమేశ్ కు వరండాలో బీరు సీసాలు, చికెన్ ప్యాకెట్లు కనిపించాయి. షాక్ కు గురైన ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం గ్రామ పంచాయతీ అధికారులకు, సర్పంచ్ విజయ్ కు ఫిర్యాదు చేశాడు.

కాగా, ఈ పాఠశాలలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గతంలో నాలుగు సార్లు ఇలాగే జరిగిందని, ఇప్పుడు భారీ స్థాయిలో పార్టీ చేసుకున్నారని మండిపడుతున్నారు. పవిత్రమైన పాఠశాలలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ చేసుకున్న ప్రాంతంలో గోడలకు ‘మన పాఠశాలే మనకు దేవాలయం, చదువుతోపాటు క్రమశిక్షణ, సంస్కారం నేర్చుకోవాలి’ అని ఉంది. వాటికి మధ్యలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలయం అని రాసి ఉంది. అయినా తాగుబోతులకు కనిపించనట్లు వ్యవహించారని ఆ గ్రామ యూత్ మండిపడుతోంది.


Next Story

Most Viewed