గుర్తింపులేని పారామెడికల్ కళాశాలలు బంద్

by  |
paramedical colleges
X

దిశ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేటు పారామెడికల్ కళాశాలలను ప్రభుత్వం పూర్తిగా మూసివేయనుంది. పారామెడికల్ విద్యా వ్యవస్థలో మార్పులు చేసేందుకు వైద్యశాఖ పలు సూచనలతో ప్రభుత్వానికి ఓ నివేదిక రూపొందించింది. పారామెడికల్ బోర్డు, కళాశాలలో జరిగిన అవినీతిపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ రెండు నెలల క్రితం విచారణకు ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో బుధవారం విచారణ కమిటీ సమావేశమైంది.

రాష్ట్రంలో అవసరానికి మించి పారామెడికల్ కళాశాలలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. రాష్ట్రంలో కేవలం 11 మాత్రమే ప్రభుత్వ కళాశాలలుండగా, 276 ప్రైవేటు కళాశాలలున్నట్లు గుర్తించారు. ఈ 276 కళాశాలల్లో 168 గుర్తింపు లేనివిగా నివేదికలో పేర్కొన్నారు. గుర్తింపులేని కళాశాలలన్నీ రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించనున్నట్లు కమిటీ నిర్ణయించింది. వీటితోపాటు పర్మిషన్ ఉన్న కళాశాలల్లో వసతులు లేని వాటిని గుర్తించి వాటి గుర్తింపు కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో కలిపి 34,657 సీట్లు ఉండగా కేవలం 6 నుంచి 7 వేల మంది స్టూడెంట్లు మాత్రమే పారామెడికల్ కోర్సుల్లో చేరుతున్నారని కమిటీ నిర్ధారించింది.

నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డు ఇటీవల విడుదల చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్ ను సైతం రద్దుచేయాలని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన పారామెడికల్ బోర్డును రద్దు చేయడం ఉత్తమమని వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల డిప్లామా కోర్సును సైతం నాలుగేండ్ల కోర్సుగా మార్చాలని కేంద్రం సూచించింది. దీనికి ఇంటర్ పూర్తిచేసిన వారు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించాలని, దీనిని హెల్త్ యూనివర్సిటీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed