మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్రమంత్రులుగా ఆ ఎంపీలు..?

by  |
మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్రమంత్రులుగా ఆ ఎంపీలు..?
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర మంత్రివర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందా..? ఎన్డీఏలో చేరాలంటూ కేంద్రం వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై ఒత్తిడి పెంచుతోందా..? రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోవడంతో వైసీపీ అండతో గట్టెక్కేందుకు వ్యూహాత్మకంగా స్కెచ్ వేస్తోందా..? ఢిల్లీ నుంచి సంకేతాలు రావడంతోనే సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం హుటాహుటిన హస్తినకు బయలుదేరారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు వస్తున్నాయి. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ చేరబోతోందనో లేకపోతే కేసులు మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటన అంటూ విపక్షాలు ఆరోపించడం.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కామన్‌గా మారిపోయింది.

అయితే ఈసారి కూడా అలాంటి ప్రచారమే మెుదలైంది. కేసుల మాఫీకోసమేనని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అలాగే ఈసారి కూడా వైసీపీ కేంద్రంలో చేరబోతుందంటూ ప్రచారం మెుదలైంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైసీపీకి కేబినెట్‌ పదవులు, అభ్యర్థుల పేర్లు కూడా చెప్పేస్తున్నారు. ఇక సీఎం జగన్ ఈనెల 10న ఢిల్లీ వెళ్లారు. హస్తినలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు అందరితో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ రెండురోజుల పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. జగన్ పర్యటన అనంతరం ఈనెల 11న ప్రధాని నరేంద్రమోడీ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగబోతుందంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

ఉదయమే సీఎం జగన్ కేంద్రమంత్రులతో కలిసి వెళ్లడంతో వైసీపీ కేంద్రంలో చేరబోతుందంటూ వార్తలు వచ్చేశాయి. వైసీపీకి 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టు తెగ ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు వైసీపీతో తెరవెనుక సంబంధాలు నడుపుతున్న బీజేపీ కొద్దికాలంగా కేంద్ర కేబినెట్‌లో చేరాలని కేంద్ర పెద్దలు సీఎం జగన్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బలం పెంచుకునే దిశగా వైసీపీ సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో బీజేపీకి వైసీపీ మద్దతు ప్రకటిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో బీజేపీ వైసీపీని కేంద్రంలో చేరాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వైసీపీ కేంద్రంలో చేరితే ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయి అన్న దానిపై చర్చ మొదలైంది. వైసీపీలో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి, ఇటీవలే తిరుపతి లోక్‌సభ నుంచి గెలుపొందిన డా.గురుమూర్తిలను కేంద్రమంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయమంత్రి ఉత్తరాంధ్ర లేదా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీకి దక్కొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారం వాస్తవమా కాదా అనేది తెలియాలంటే సీఎం జగన్ అయినా క్లారిటీ ఇవ్వాలి లేదా బీజేపీ అధిష్టానం అయినా పెదవి విప్పాలి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed