నేటి నుంచి ఆఫీసులకు కేంద్రమంత్రులు

by  |
నేటి నుంచి ఆఫీసులకు కేంద్రమంత్రులు
X

దిశ, న్యూస్ బ్యూరో: దాదాపు ఇరవై రోజుల విరామం అనంతరం కేంద్ర మంత్రులు సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. వారివారి ఆఫీసులకు వెళ్ళనున్నారు. జాయింట్ సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులు కూడా హాజరవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు అన్ని మంత్రిత్వశాఖల అధికారులు, సిబ్బంది ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగుస్తున్నందున వెంటనే చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు దృష్టి పెట్టనున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ, ఆర్థిక, ఆరోగ్య తదితర శాఖల మంత్రులు మాత్రం యథావిధిగా ఆఫీసులకు హాజరవుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఆయా శాఖలకు జరిగిన నష్టం, ఇకపై తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై మంత్రులు వారి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ ముగియడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున ఆయా శాఖల్లో మూడో వంతు ఉద్యోగులు మాత్రమే ఈ రెండు రోజులపాటు హాజరుకానున్నారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉద్యోగులు యథావిధిగా హాజరుకావడం ఆధారపడి ఉంటుంది.

లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయినందున కొన్ని పరిశ్రమలను ఏప్రిల్ 15 నుంచి పాక్షికంగా పని చేయించేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేశాన్ని మూడు జోన్లుగా విభజించి ఏయే పరిశ్రమలకు పనిచేయడానికి అనుమతి ఇవ్వాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కరోనా పాజిటివ్ కేసులు పదిహేను కంటే ఎక్కువ నమోదై వైరస్ వ్యాప్తి గణనీయంగా ఉండి హాట్‌స్పాట్ క్లస్టర్లుగా ప్రకటించిన జిల్లాలను రెడ్ జోన్‌గానూ, తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదై హాట‌్‌స్పాట్ లేని జిల్లాలను ఆరెంజ్ జోన్‌లుగానూ, కరోనా బాధ లేని జిల్లాలను గ్రీన్ జోన్‌గానూ పరిగణించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రెడ్ జోన్ జిల్లాల్లో ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉన్న యథాతధ స్థితినే కొనసాగించాలని, ఆరెంజ్ జోన్‌ జిల్లాల్లో మాత్రం కనీస స్థాయిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు వ్యవసాయ పనులకు ఆటంకం లేని విధంగా పాక్షికంగా ఆంక్షలను సడలించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గ్రీన్ జోన్ జిల్లాల్లో మాత్రం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా పనిచేసేలా నిర్ణయం తీసుకుని కార్మికులు పని స్థలంలో తగిన ‘సోషల్ డిస్టెన్స్’ పాటించేలా, శానిటైజర్, హ్యాండ్ వాష్, మాస్క్ లాంటివి పాటించేలా, కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా అక్కడే వసతి సౌకర్యం కల్పించే షరతును విధించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ కాలంలో ఇళ్ళకు మాత్రమే పరిమితమైన పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆఫీసులకు రావడం మొదలవుతుంది కాబట్టి ఢిల్లీ రోడ్లపై మళ్ళీ వాహనాల రాకపోకలు షురూ కానున్నాయి. ఈ 21 రోజుల కాలంలో ఆయా శాఖలపై పడిన ప్రభావం, తిరిగి యధాతథ స్థితికి చేరుకోడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆ శాఖల పరంగా ప్రజలకు అందాల్సిన సేవలు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం లాంటి అంశాలపై మంత్రులు, అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి, ఆహారం-పౌరసరఫరాలు, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలు తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి, ఇకపైన ఎలా వేగవంతం చేయాలి తదితర అంశాలపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు.

Tags: Union Government, Ministers, Resume office, Joint Secretary, Reviews, LockDown
ఇమేజ్ : ఢిల్లీ నార్త్, సౌత్ బ్లాక్ ఫోటోలను వాడుకోవచ్చు.
===

Next Story

Most Viewed