2021-22 బడ్జెట్‌లో ఐదు కీలక అంశాలు!

by  |
2021-22 బడ్జెట్‌లో ఐదు కీలక అంశాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పైనే ఉంటుంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను ఏ విధంగా గట్టెక్కించగలరని చూస్తున్నారు. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7.7 శాతం ప్రతికూలంగా అంచనా వేసింది. ఇటీవల ఆర్థికవ్యవస్థలో కనిపిస్తున్న పునరుద్ధరణను కొనసాగించే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది బడ్జెట్‌లో కీలకంగా ఉండనున్న అంశాలను ఒకసారి పరిశీలిద్దాం!

ద్రవ్యలోటు..

సులభంగా చెప్పాలంటే, ఆర్థిక లోటు ప్రభుత్వ ఖర్చుతో పోలిస్తే ఆదాయంలో కొరత ఉండటం. 2020-21కి ఆర్థిక లోటు లక్ష్యాన్ని 3.5 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మహమ్మారి కారణంగా ప్రభుత్వ పన్ను రసీదులు ఒత్తిడిలో ఉన్నందున, ఇది లక్ష్యం కంటే అధికంగా ఉండొచ్చని సమాచారం. గత వారాంతం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఏడాదికి తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించడానికి ఖర్చులను పెంచాల్సిన అవసరం ఉందని, 2021-22కి అధిక ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ..

2020-21 కేంద్ర బడ్జెట్‌లో రూ. 2.1 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే, కరోనా వల్ల ప్రభుత్వ ప్రణాళికలు ప్రభావితం కావడంతో పాటు ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో రూ. 15,220 కోట్లను మాత్రమే సేకరించగలిగారు. ఈ క్రమంలో కొత్త బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అధిక పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఇందులో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ, ఎయిర్ ఇండియా అమ్మకం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్దేశాలను ప్రకటించింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్యాకేజీలో భాగంగా వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా ప్రభుత్వ రంగ కంప్నీలు ఉంటాయని, ఇతర రంగాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ప్రైవేటీకరించబడతాయని గతేడాది తెలిపింది. పెట్టుబడుల ద్వారా వచ్చే అధిక ఆదాయం ఖర్చులు పెంచేందుకు ప్రభుత్వానికి సాయంగా ఉంటుందని పేర్కొంది.

వేతనజీవులకు పన్ను ప్రయోజనాలు..

కొవిడ్-19 మహమ్మారి వల్ల ప్రజలు తమ ఆదాయాన్ని ఆదా చేస్తూ, ఖర్చులను తగ్గించారు. ఖర్చులు పెంచేందుకు వేతనజీవుల్లో నగదు ఉండే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశం ఉంది. ఈ చర్యలు ఆర్థికవ్యవస్థకు తోడ్పడనున్నాయి. దీనికోసం ఆదాయ పన్ను శ్లాబ్‌లో మార్పులకు అవకాశం ఉంది. లేదా 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1.5 లక్షల కంటే ఎక్కువకు పెంచవచ్చు. సెక్షన్ 80సీ కింద జీవిత బీమా ప్రీమియం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్, ఈక్విటీ-లింక్‌డ్ సేవింగ్ స్కీములు, గృహ రుణాల మొత్తం, స్టాంప్ డ్యూటీ, ఆస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సుకన్య సమృద్ధి యోజన వంటివి ఉన్నాయి.

ఆరోగ్యంపై అధిక వ్యయం..

కరోనా వైరస్ వల్ల దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రాముఖ్యత పెరిగింది. వ్యవస్థను బలోపేతం చేసేందుకు, భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొని మెరుగ్గా ఉండేందుకు ఆరోగ్య రంగంలో ఖర్చులను పెంచాలని దేశీయంగా అన్ని వర్గాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. కావున, ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయాన్ని ప్రస్తుతం జీడీపీలో 1 శాతం నుంచి 2.5 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని ఆర్థిక సర్వే కూడా అభిప్రాయపడింది. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం పెంచడంతో పాటు, ఆరోగ్య బీమా ప్రీమియం, మెడికల్ చెక్అప్‌ల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు, మినహాయింపులను ప్రకటించవచ్చు. ప్రభుత్వం తన ప్రధాన ప్రజారోగ్య బీమా పథకం ‘ఆయుస్మాన్ భారత్ ప్రధాన మంత్రి జనారోగ్య యోజన్’ విస్తరణకు చర్యలు చేపట్టవచ్చు.

‘ఆత్మ నిర్భర్ భారత్’పై మరింత దృష్టి..

దిగుమతి చేసుకున్న వస్తువులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇటీవల ప్రభుత్వం దృష్టి సారిస్తూ..’ఆత్మ నిర్భర్ భారత్’ను ప్రకటించింది. స్థానిక తయారీని పెంచేందుకు అనేక రంగాలకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాలను ఇప్పటికే ప్రకటించింది. దీన్ని కొనసాగిస్తూ..దేశీయ తయారీ, ఎగుమతులను పెంచేందుకు, ఉద్యోగాల సృష్టికి తదుపరి చర్యలను బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed