బ్రేకింగ్ న్యూస్: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్

by  |
mlc-elections
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్ దాఖలు చేసిన పత్రంలో సంతకాలు చేసిన ఇద్దరు సభ్యులు తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు. మంగళవారం నామినేషన్ల చివరి రోజు నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాద్‌కు చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అందులో 10 మంది తనను బలపర్చారని సంతకాలతో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా నిజామాబాద్ 32వ డివిజన్ కార్పొరేటర్ రజియా సుల్తానా ఈ మేరకు తన తనయుడు మునావార్ ఆలీతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు.

‘తాము ఎవరి నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేయలేదు. కోటగిరి శ్రీనివాస్ తమ సంతకాలను ఫోర్జరీ చేశారు.’ అని వారు ఆరోపించారు. నందిపేట మండలం ఎంపీటీసీ-3 ఎర్రం నవనీత సైతం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. అందులో వారు మాట్లాడుతూ.. తాము కూడా ఎవరి నామినేషన్ పత్రాల మీద బలపరుస్తూ సంతకాలు చేయలేదని తెలిపారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన ప్రతిపక్షాలు లేకపోవడంతో ఏకగ్రీవం అనుకున్న సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలువడంతో అందరూ ఎన్నికలు జరుగుతాయని ఊహించారు. కానీ, అనూహ్యంగా ఇద్దరు స్థానిక సంస్థల ఓటర్లు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని సోషల్ మీడియా ద్వారా ముందుకు రావడం కలకలం రేపింది. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీతో పాటు ఓటర్లలోనూ సందిగ్ధం నెలకొంది. మీడియా ముందుకు వచ్చిన ఇద్దరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లడం విశేషం.



Next Story

Most Viewed