బ్రేకింగ్: ఈటలకు షాకిచ్చిన బీజేపీ.. కీలక నేత తొలగింపు

by  |
BJP, Etela Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సవాల్‌గా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా.. హుజురాబాద్ టౌన్ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి(లడ్డు)ను తొలగిస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. బీజేపీ వర్గాల్లో ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. ఓ వైపున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండాల్సిన నాయకులు పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చకెక్కించుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన నాయకులు వర్గపోరుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. విద్యార్థి దశ నుండి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న మహేందర్‌ను కావాలనే పక్కకు తప్పించారన్న వాదన వినిపిస్తున్నారు స్థానిక బీజేపీ నాయకులు.

Huzurabad‌ BJP

రట్టు చేసుకుంటున్నారా..?

ఇప్పటికే ఈటలకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన గెలుపు విషయంలో కమలనాథులు కష్టపడడం లేదన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో భగ్గుమన్న విబేధాలు ఆ పార్టీకి తీరని నష్టాన్నే కలిగించనున్నాయి. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలపై దూకుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఐదు వార్డులను బీజేపీ కైవసం చేసుకోగా మరో ఐదు స్థానాల్లో తక్కువ మెజార్టీతో కోల్పోయింది. అప్పుడు కూడా మహేందర్ రెడ్డి టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడని, అందులో ఆయన కూడా 15 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడని ఆయన వర్గం అంటోంది. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతాడా? అని ప్రశ్నిస్తున్నారు.

టీఆర్ఎస్ మైండ్ గేమ్..?

హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందనే చర్చ కూడా సాగుతోంది. తమకు బీజేపీ నాయకులు టచ్‌లో ఉన్నారంటూ లీకులు ఇస్తుండడంతో బీజేపీ ముఖ్య నాయకులను డైలమాలో పడేస్తున్నట్టుగా ఉంది. మహేందర్ రెడ్డి విషయంలోనూ దాదాపు ఇదే జరిగి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్న వారూ లేకపోలేదు.

చీఫ్ వద్దకు..

హుజురాబాద్ టౌన్ అధ్యక్షుడు లడ్డును తొలగిస్తున్నట్టుగా జారీ చేసిన లేఖ పంచాయితీ కాస్తా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వద్దకు మరి కొద్దిసేపట్లో చేరనుంది. భవానీ దీక్షలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో ఉన్న బండి వద్దకు మహేందర్ రెడ్డి వర్గం రానున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed