‘వారిపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ’

by  |
‘వారిపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ’
X

దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేష్ యాదవ్ విమర్శించారు. గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలు అందిస్తానీ చెబుతూ వారి దగ్గర ఒక్కొక్కరికి 31, 250 చొప్పున 28, 500 మంది దగ్గర డీడీలు కట్టించుకుని ఇంత వరకు వారికి గొర్రెలను ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

గొర్రెల కోసం కట్టిన తొమ్మిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడుకొని, పేదలైన గొల్ల కురుమలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని, అణగారిన బీసీ వర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ , నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కార్యాలయాలకు నిధులు కేటాయించుకుని భవనాలు నిర్మించుకున్నారు.. కానీ బీసీల ఆత్మగౌరవానికి ఏర్పాటు చేస్తానన్న సంఘ భవనాలకు నేటి వరకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా నేడు రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి గొర్ల కాపరి అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చే ఒక లక్షా 25 వేలు నేరుగా జమ చేయాలని,50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు మూడు వేల పింఛన్ అందజేయాలని,ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రె కాపరులకు ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని,559,1016 జీవోను తక్షణమే అమలు చేయాలి, బంజరై, బీడు, శిఖం భూములను గొర్రెల మేతకు కేటాయించాలని, అలాగే ప్రతి గ్రామంలో 20 ఎకరాల భూముల్లో గొర్రెలకు షెడ్ నిర్మించి ఇవ్వాలని,ప్రతి మండల కేంద్రంలో గొర్రెల అంగడి కోసం పది ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే గొల్ల కురుమల అడ్డం తిరుగుతాయని వారు సమావేశంలో హెచ్చరించారు.

Next Story