ఒక్క బెడ్ మీద ఇద్దరు.. వార్డుల ఎదుట శవాలు

by  |
ఒక్క బెడ్ మీద ఇద్దరు.. వార్డుల ఎదుట శవాలు
X

న్యూఢిల్లీ : ప్రజల నిర్లక్ష్యమో, పాలకుల వైఫల్యమో గానీ దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఆసుపత్రిలలో బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్లు దొరకకా బాధితులు ప్రాణాలొదులుతున్నారు. నిన్నా మొన్నటి దాకా మహారాష్ట్రను మాత్రమే వణికిస్తుందనుకున్న కరోనా రెండోదశ ఇప్పుడు దేశమంతా విస్తరించింది. ముఖ్యంగా దేశ రాజధాని అయితే వైరస్ దాటికి చిగురుటాకులా వణుకుతున్నది. ప్రత్యేకించి కరోనా పేషెంట్ల కోసం ఢిల్లీలో ఉన్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (ఎల్ఎన్‌జేపీ) లో 1,500 పడకలున్నా అవీ చాలడం లేదు. దేశంలో కొవిడ్ బాధితులకు అన్ని వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులలో ఇది ఒకటి. తాజాగా కరోనా కేసుల పెరుగుదలతో ఎల్ఎన్‌జేపీలో రోగుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఒక్కో బెడ్ మీద ఇద్దరు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. బెడ్ షేర్ చేసుకుంటున్న వారేమీ సంబంధీకులు కాదు. కరోనా రోగులు ఎక్కువవుతుండటంతో మరో 300 బెడ్లు కూడా పెంచినా అవి కూడా నిండిపోయాయి. ఆస్పత్రి ఎదుట వందలాది మంది బాధితులు వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఇక ఆస్పత్రి వార్డుల వద్ద శవాలు ఒక్కోక్కటిగా పోగవుతున్నాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు కన్నుమూస్తుండగా.. వారిని తీసుకుపోవడానికి కూడా రెండు, మూడు రోజులు అక్కడే వేచి చూడాల్సిన దుర్భర పరిస్థితి దాపురించిందని మృతుల బంధువులు వాపోతున్నారు. ఢిల్లీలో శ్మశానాలన్నీ రద్దీగా మారడంతో అక్కడ కాల్చడానికి కూడా రోజుల కొద్దీ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎల్ఎన్‌జేపీలో పరిస్థితిపై మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మేం పని చేస్తున్నాం. ఇప్పటికే బెడ్లన్నీ నిండిపోయాయి. తొలిదశ వైరస్ విజృంభణ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నా ఇప్పుడు మళ్లీ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ రోజు (గురువారం) ఒక్కరోజే దాదాపు 160 కొత్త అడ్మిషన్లు తీసుకున్నాం’ అని తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం, వారి నిర్లక్ష్య ధోరణి వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పడం గమనార్హం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed