పెళ్లికి వెళుతూ.. పెళ్లి కారు ఢీకొని

by  |
పెళ్లికి వెళుతూ.. పెళ్లి కారు ఢీకొని
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పెళ్లికి వెళుతూ… మరో పెళ్లి కారు ఢీ కొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం భూత్పూర్ మండలం పోల్కంపల్లి గేట్ జాతీయ రహదారి వద్ద జరిగింది. మహబూబ్ నగర్ మునియప్ప గుట్ట ప్రాంతంలోని కిద్వాయ్ పేటకు చెందిన మహేష్(23), శరత్ కుమార్ (22) అనే యువకులు ఖిల్లా గణపురం మండలం మనోజ్ పేటలో జరిగే వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్ పై బయలుదేరారు. మహబూబ్ నగర్ నుండి భూత్పూర్ మండలం తాటికొండ గ్రామం మీదుగా 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా.. మరో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడిని కొత్తకోట వైపు తీసుకువెళ్తున్న కారు ఢీకొట్టింది.

రెండు వాహనాలు వేగంగా ఉండడంతో మోటార్ సైకిల్ పై ఉన్న యువకులు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలిసిన భూత్పూర్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story