తెలంగాణలో మరో రెండు నేషనల్ హైవేలు

by  |
National Highway
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు మరో రెండు నేషనల్ హైవేలను కేంద్రం ప్రకటించింది. భారత్​మాల పరియోజనలో ఈ రెండు రోడ్లను చేర్చినట్లు వెల్లడించారు. వీటి నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(గౌరెల్లి) నుంచి వలిగొండ మీదుగా కొత్తగూడెం వ‌ర‌కు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించారు. కొత్తగా మంజూరైన ఈ జాతీయ ర‌హ‌దారి ఓఆర్ఆర్ గౌరెల్లి వ‌ద్ద మొద‌లై వ‌లిగొండ, ‌తొర్రూర్, నెల్లికుదురు, ఇల్లందు మ‌హ‌బూబాబాద్ మీదుగా కొత్తగూడెం వ‌ర‌కు ఉంటుంది. దీని వ‌ల్ల ఏజెన్సీ జిల్లాలు మ‌హ‌బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ది చెందుతాయ‌ంటున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోదావ‌రి తీరాన ఉన్న భ‌ద్రాచ‌లం దేవ‌స్థానానికి, విశాఖ పోర్టు, ఛ‌త్తీస్‌గడ్ రాష్ట్రాల‌కు దాదాపు 100 కి.మీ దూరం త‌గ్గనుంది. దీన్ని ఎన్​హెచ్​30గా పిలువనున్నారు.

అంతేగాకుండా.. రాష్ట్రంలోని బాపూర్-చించోళి-తాండూర్-కొడంగల్-మహబూబ్‌నగర్ వరకు మరో జాతీయ రహదారిని కేంద్రం ప్రకటించింది. దీంతో కర్ణాటక నుంచి తెలంగాణకు మధ్య రాకపోకలు మరింత మెరుగుకానున్నాయి. త్వరలోనే ఈ రెండు జాతీయ రహదారుల పనులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతిపాదిత మ్యాప్‌ను సైతం విడుదల చేశారు. కాగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు వెళ్లేలా ఎన్‌హెచ్‌ను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed