ఏది నిజం? ‘చల్మెడ’లో కొవిడ్ పేషెంట్స్ 61.. కాదు కాదు 42 మాత్రమే..

by  |
ఏది నిజం? ‘చల్మెడ’లో కొవిడ్ పేషెంట్స్ 61.. కాదు కాదు 42 మాత్రమే..
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ నగర శివారులోని చల్మెడ వైద్య కళాశాలలో కరోనా వైరస్ బారిన పడ్డ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య వెల్లడించడంలో అటు అధికారులు, ఇటు కళాశాల యాజమాన్యం పొంతనలేని ప్రకటనలు చేస్తున్నాయి. కళాశాల చైర్మన్ 61 మంది కొవిడ్ బారిన పడినట్టు పేర్కొంటే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం 42 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల నిర్వహణలో కూడా ఇరువురి మాటల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. నిన్నటి నుంచి నేటి మధ్యాహ్నం వరకు కళాశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ స్పష్టం చేశారు. అయితే, డీఎంహెచ్ఓ మాత్రం 364 మందికి మాత్రమే టెస్టులు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.

వీరిద్దరిలో ఇప్పుడు ఎవరి వ్యాఖ్యలు నమ్మాలో తెలియక గందరగోళం నెలకొంది. కళాశాల యాజమాన్యం చేయాల్సిన ప్రకటన, అధికారులు చేస్తుండటం వెనుక ఆంతర్యమేంటో అంతుబట్టకుండా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలా..? లేక సంఖ్యను ఎక్కువ చూపితే ప్రజలు భయపడే అవకాశాలుంటాయనే భావనా? అసలు దీనిపై అధికారుల మానిటరింగ్ ఉందా.. లేదా? అనే చర్చ నడుస్తుంది. వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తం చేయాల్సిన యంత్రాంగం చేసిన ప్రకటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనేది అసలు వాస్తవం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో థర్డ్ వేవ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా పంజా విసురుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్యారోగ్య శాఖ మాత్రం నామమాత్రంగా పనిచేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.


Next Story

Most Viewed