ఈ పరికరం ధరిస్తే చాలు.. కొవిడ్ దూరం

by  |
ఈ పరికరం ధరిస్తే చాలు.. కొవిడ్ దూరం
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించాయి. ఈ క్రమంలో కొవిడ్ ఉన్నప్పటికీ జనాలు బయట తిరుగుతూనే తమ పనులు చేసుకుంటున్నారు. అత్యవసర పనులకు నిమిత్తం లేదా ఉద్యోగాలకు వెళ్లే క్రమంలో బస్సుల్లో ఇతర వ్యక్తుల నుంచి కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశముండగా, ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు బిహార్‌కు చెందిన విద్యార్థులు యూనిక్ డివైస్ రూపొందించారు. వారి ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ కూడా ఇవ్వడం విశేషం.

బిహార్‌కు చెందిన విద్యార్థులు అర్పిత్ కుమార్ (12వతరగతి), అభిజిత్ కుమార్ (10వ తరగతి) ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల కోసం ఏర్పాటు చేసిన బాల్ భవన్ కిల్కరిలో చదువుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉన్న వీరిద్దరూ ఏదైనా వినూత్న ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొవిడ్ ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగపడేలా డివైస్ రూపొందించాలనుకొని తమ ఆలోచనను అధ్యాపకులు, డైరెక్టర్‌తో పంచుకున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల పాటు శ్రమించి ‘బ్యాడ్జి’ మాదిరిగా ఉండే ఓ పరికరాన్ని దుస్తులపై ధరించేందుకు వీలుగా రూపొందించారు. ఇది ఇన్‌ఫ్రారెడ్ సెన్సిటివిటీ సూత్రం ఆధారంగా ఎదుటి వ్యక్తి టెంపరేచర్‌ను అంచనా వేసి అలర్ట్ చేస్తుంది. తద్వారా కరోనా అంచుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ పరికరానికి ‘కాంటాక్ట్ లెస్ టెంపరేచర్ అండ్ డిస్టెన్స్ మెజరింగ్ (CTDM)’ అని నామకరణం చేశారు.

ఈ ఆవిష్కరణకు గాను కేంద్రప్రభుత్వం పేటెంట్స్ ఇవ్వడంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అర్పిత్, అభిజిత్ ఈ డివైస్ తయారీకి చాలా కష్టపడ్డారని బాల్ భవన్ కిల్కరి డైరెక్టర్ జ్యోతి పరిహార్ ప్రశంసించారు. ఇక ఈ డివైస్ జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బిహార్ మెడికల్ ఇండస్ట్రియలిస్టులను సంప్రదించామని, త్వరలో బల్క్ ప్రొడక్షన్ చేస్తామని వివరించారు.


Next Story