కేసీఆర్ మాటలు నీటిమీద రాతలు.. తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం

by  |
TWJF Journalists Union leader
X

దిశ, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. TWJF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ‘డిమాండ్స్ డే’ సందర్భంగా జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు అవుతున్నా.. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు(అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా), ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేగాకుండా.. జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు గౌడ్, కార్యదర్శి జానయ్య, రాష్ట్ర నాయకులు నాయిని శ్రీనివాస్ రావు, బుక్క రాంబాబు, లింగాల సాయి, పాలవరపు శ్రీనివాస్, గట్టు అశోక్, బూర వెంకటేశ్వర్లు, తండ నాగేందర్ గౌడ్, ఫణి నాయుడు, శ్రీనివాస్, శరత్, వెంకన్న, నందిపాటి సైదులు, బుక్క ఉపేందర్, అర్జున్, ప్రభాకర్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed