భారత్ కి ఆర్థిక సాయం ప్రకటించిన ట్విట్టర్!

by  |
భారత్ కి ఆర్థిక సాయం ప్రకటించిన ట్విట్టర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కేంద్రానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కరోనా చికిత్స కేంద్రాల ఏర్పాటుతో పాటు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సరఫరా, ఔషధాల కొనుగోళ్లకు రూ. 110 కోట్లను అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఈ విరాళం మొత్తాన్ని భారత్‌లో కరోనా సేవలను అందిస్తున్న ఎయిర్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ, కేర్ స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించనున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ ప్యాట్రిక్ డొర్సె చెప్పారు. ఈ మూడు సంస్థల ద్వారా విరాళంగా ఇచ్చే నిధులను ఖర్చు చేస్తామని ఆయన వివరించారు.

ఇక, దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు 4,000 ఆక్సిజన్ కాన్సంట్రేషన్లను అందిస్తామని మంగళవారం ప్రకటించింది. ‘మిషన్ HO2PE’ కార్యక్రమం కింద దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, లక్నో వంటి ప్రధాన నగరాలకు వీటిని పంపుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు హెచ్‌యూఎల్ సంస్థ దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలతో సహా ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాదారులు, పంపిణీదారులుగా ఉన్న సుమారు 3 లక్షల మంది టీకా ఖర్చును కంపెనీయే భరిస్తుందని వెల్లడించింది.



Next Story