‘జర్నలిస్టులకు గాంధీలో కోవిడ్ వైద్యం వద్దు

by  |
‘జర్నలిస్టులకు గాంధీలో కోవిడ్ వైద్యం వద్దు
X

దిశ , హైదరాబాద్: కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య చికిత్సలు గాంధీ ఆసుపత్రిలో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీయూడబ్ల్యుజె ప్రతినిధుల బృందం గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‎ను బీఆర్కే భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు జర్నలిస్టుల కరోనా కష్టాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కరోనాతో మృతి చెందిన యువ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు కొలుకునేంతవరకు వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక చేయూత అందించాలని వారు మంత్రిని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జర్నలిస్టుల ఆరోగ్య సేవల కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‎కు విన్నపం:

రాష్ట్రంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలపై కనీసం మీరైనా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. గురువారం ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలను లిఖిత పూర్వకంగా ఆమె దృష్టికి తీసుకెళ్లింది. గత నాలుగేళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు గవర్నర్ కు విన్నవించారు. ముఖ్యంగా కరోనా ప్రమాదం నుండి జర్నలిస్టులను రక్షించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు గురయ్యారని, ఇందులో మనోజ్ కుమార్ అనే యువ పాత్రికేయుడు ఇటీవలే ప్రాణం కోల్పోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న జర్నలిస్టులకు సరైన చికిత్స అందడం లేదన్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పారామెడికల్, పారిశుధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే జర్నలిస్టులు సైతం ప్రాణాలను ఫణంగా పెట్టి విశిష్టమైన సేవలను అందిస్తున్నారన్నారు. ఇందుకుగానూ జర్నలిస్టులకు కూడా రూ.50లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కరోనాతో మృతి చెందిన మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి కేటాయించాలన్నారు. వ్యాధి నుండి కొలుకునేంతవరకు బాధిత జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందించాలని టీయూడబ్ల్యుజె ప్రతినిధి బృందం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు ఉన్నారు.

మనోజ్ మృతి బాధాకరం: గవర్నర్

టీవీ 5 విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు. కరోనా వ్యాధి కట్టడిలో జర్నలిస్టుల సేవలను ఆమె ప్రశంసిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తనను కలుసుకున్న ఐజేయూ, టీయూడబ్ల్యుజె ప్రతినిధి బృందంతో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి సమాజాన్ని కాపాడేందుకు వార్తల ద్వారా ప్రజలను మరింత చైతన్య పర్చాలని కోరారు. కరోనా కాటుకు గురయ్యే జర్నలిస్టులకు చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని ఆమె పేర్కొంటూ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తానని ఐజేయూ, టీయూడబ్ల్యుజె ప్రతినిధి బృందానికి ఆమె హామీ ఇచ్చారు.

Next Story