పెద్దపల్లి జిల్లాలో అలజడి.. క్షుద్రపూజలు.. రేప్.. మర్డర్!!

by  |
పెద్దపల్లి జిల్లాలో అలజడి.. క్షుద్రపూజలు.. రేప్.. మర్డర్!!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో క్రైం రేట్ పెరిగిపోతుందా..? శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా..? అరాచక శక్తులకు అడ్డాగా మారుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గడిచిన 15 రోజులు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించేలా మూడు ఘటనలు జరిగాయి. క్షుద్రపూజల పేరిట మంత్రగాళ్లు యువతిని అపహరించే ప్రయత్నం మరవక ముందే.. ఇటుక బట్టీల్లో వలస కూలీపై అత్యాచారం కలకలం సృష్టించింది. ఆ సంఘటన కరుమరుగు కాకముందే న్యాయవాది దంపతులను పట్టపగలు అందరి ముందే హత్య చేయడం జిల్లా ప్రజలను కలవర పెడుతోంది. పక్షం రోజుల్లోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

యువతి కోసం క్షుద్రపూజలు

జిల్లాలోని ఓ యువతిని కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర గ్యాంగ్ ప్రయత్నించింది. రూ.20 లక్షలు, బంగారం ఆశ చూపి ఆ యువతి తల్లితోనే బేరమాడారు మాయగాళ్లు. మహారాష్ట్రకు చెందిన పూజారి.. స్థానికులను మధ్యవర్తిగా చేసుకుని ఈ మోసానికి పాల్పడ్డాడు. కన్నెపిల్లతో పూజలు చేస్తే డబ్బుల వర్షం కురుస్తుందని, వాటితోపాటు బంగారం ఇస్తామని ఆ యువతి తల్లిని నమ్మించారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆయన గ్రామానికి చెందిన మధ్యవర్తులను నిలదీయడంతో యువతిని ఎత్తుకెళ్లే ప్లాన్ బయటపడింది. ఈ ఘటన మరవక ముందే సుల్తానాబాద్ శివారులోని నీరుకుల్ల రోడ్డు సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. పూజలు చేసిన ప్రాంతంలో నిమ్మకాయలు, కోడిగుడ్లు, మనిషి బొమ్మ ఆకారంలో ఓ చిత్రాన్ని గీశారు. దానిపై వికృతంగా పసుపు, కుంకుమ చల్లారు. దీంతో అటు వైపు నుండి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. రాత్రిపూట క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

ఒడిసా యువతిపై గ్యాంప్ రేప్

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గౌరెడ్డిపేట శివారులోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒడిసా రాష్ట్రం బొలంఈర్‌ జిల్లా పొడ్ముండ రెంగేలి గ్రామానికి చెందిన బాధిత యువతి(18) తన భర్తతో కలిసి ఇటుకబట్టీలో పనిచేస్తోంది. అక్కడ పని చేయలేక గతనెల 24న ఇంటికి వెళ్తున్న భార్యభర్తలను బట్టీ యజమాని అడ్డుకోని బంధించాడు. భర్త ఎదుటే ఇటుక బట్టీ యజమాని సహా ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు తొటి కార్మికులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశంతో జిల్లా అధికారులు విచారణ చేట్టారు.

న్యాయవాదుల మర్డర్‌తో ఉలిక్కి పడిన జిల్లా..

రామగిరి మండలం కలవచర్లలో కారులో వెళ్తున్న హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటన జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం నడీరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. దంపతులిద్దరినీ కత్తులతో నరికిన అనంతరం అనుమానితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. చావుబతుకుల్లో ఉన్న వామన్ రావు.. తనపై కుంట శ్రీనివాస్ అనుచరులు దాడిచేసినట్లు స్థానికులకు వాంగ్మూలం ఇచ్చారు.
కుంట శ్రీనివాస్ మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే వామన్ రావు పెద్దపల్లి జెడ్పీచైర్మన్ పుట్టా మధుకు వ్యతిరేకంగా పలు కేసులను వాదిస్తున్నారు. గతంలో శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులోనూ హైకోర్టులో పిల్ వేశాడు. మరికొన్ని కీలక కేసులు వాదిస్తున్న వామన్ రావుకు గత కొద్ది రోజుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇలా జిల్లాలో వరుసగా జరుగుతున్న సంఘటనలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో, ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పోలీసులు జిల్లాలో కార్డన్ సెర్చ్ లు నిర్వహించడంతోపాటు పెట్రోలింగ్ ను పెంచాలని కోరుతున్నారు.



Next Story