తుమ్మ‌ల టీడీపీ పగ్గాలు చేపడుతారా..?!

by  |
తుమ్మ‌ల టీడీపీ పగ్గాలు చేపడుతారా..?!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తుమ్మల బీజేపీ వెళ్తున్నారని కొందరు.. లేదు టీడీపీకని మరికొందరు.. ఏ పార్టీకి వెళ్లడం లేదు టీఆర్ఎస్‌లోనే కొనసాగుతారని ఇంకొందరు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏ ఇద్దరు కలిసినా ఇదే టాఫిక్‌పై చర్చించుకుంటున్నారు. ఇంతకు ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు..? ఆయనను ఆహ్వానిస్తున్నది ఎవరు..? తుమ్మల చూపు ఎటుందో తెలుసుకోవాలంటే ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనం చదవాల్సిందే..!

కొత్త ప్రచారంతో కార్యకర్తలు షాక్..

మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు పార్టీ మార్పుపై వారం రోజులుగా జిల్లాలో భిన్న‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఆయ‌న టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటూ బీజేపీకి ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తున్నార‌న్న‌ది ఆ చ‌ర్చ‌ల సారాంశం. అయితే ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న పార్టీ మార్పుపైగాని, భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై గాని అధికారికంగా నోరు విప్పి ఎక్క‌డా చెప్పలేదు. కానీ రాజ‌కీయ వ‌ర్గాల్లో, పార్టీ నేత‌ల్లో ఊహాగానాలు మాత్రం విస్తృతంగా కొన‌సాగుతుండ‌టం విశేషం. ఈ క్ర‌మంలోనే తుమ్మ‌ల గురించి తెలుగు త‌మ్ముళ్లు ఆలోచిస్తున్నారంట‌. తెలంగాణ తెలుగుదేశంలో చేరి పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఉందంటూ పేర్కొనడం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.

ఆ వ్యూహం బాబుదేనా..?

గ‌తంలో తెలంగాణ టీడీపీలో ప‌నిచేసి..ఇప్పుడు రాజ‌కీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌ను కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మాజీమంత్రి తుమ్మ‌ల‌కు అప్ప‌గించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో తుమ్మ‌ల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రియారిటీని సైతం వారు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం కూడా పార్టీలో పెద్ద లీడ‌ర్‌గా తుమ్మ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరును కొనియాడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తుమ్మ‌ల మ‌ళ్లీ పార్టీలోకి వ‌స్తే ఎంతో బ‌లోపేతం అవుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆశ ప‌డుతున్నారంట‌. అయితే తెలుగు త‌మ్ముళ్ల ఆశ‌లు ఎలా ఉన్నా.. తుమ్మ‌ల అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం అసాధ్య‌మేన‌ని అంటుండ‌గా.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు అంటూ మ‌రికొంత‌మంది అభిప్రాయపడుతున్నారు.

ఆ ఇద్దరు మంత్రులు వచ్చింది అందుకేనా..?

తుమ్మ‌ల గ‌త ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్‌ సిట్టింగ్ అభ్య‌ర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్య‌ర్థి కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి చేతిలో అనుహ్యంగా ఓట‌మి పాలైన విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో కందాళ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. దీంతో తుమ్మ‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం ఇబ్బంది మారడంతో చాలా వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఐదు రోజుల క్రితం మంత్రులు పువ్వాడ‌, నిరంజ‌న్‌రెడ్డిలు ఇంటికి వెళ్లి మ‌రీ రైతు వేదిక‌ల ప్రారంభోత్స‌వానికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తుమ్మ‌ల బీజేపీలోకి వెళ్తున్న‌ట్లుగా సీఎం కేసీఆర్‌కు స‌మాచారం అంద‌డంతోనే ఇద్ద‌రు మంత్రుల‌ను పంపి నిలవరించినట్లు జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. అయితే తుమ్మ‌ల మాత్రం మౌనం వీడ‌టం లేదు. టీఆర్ఎస్ పార్టీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. తుమ్మ‌ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నారో అన్న‌ది వేచి చూడాలి.

Next Story

Most Viewed