ఆర్టీసీకి బస్సులు కావాలి.. కానీ, పైసల్లేవ్!

by  |
ఆర్టీసీకి బస్సులు కావాలి.. కానీ, పైసల్లేవ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీకి అత్యవసరంగా బస్సులు అవసరమవుతున్నాయి. గ్రేటర్​ పరిధిలో వెయ్యికి పైగా బస్సులు కావాల్సి ఉంటోంది. మొత్తంగా 1300 బస్సులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. సొంతంగా బస్సులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ప్రైవేట్​ నుంచి బస్సులను అద్దెకు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఫేమ్​ పథకంలో ముందుగా చేసిన నిర్లక్ష్యంతో కేటాయింపులు రద్దు అయ్యాయి. ప్రస్తుతం కేంద్రం వాటిని పునరుద్ధరించేందుకు అవకాశం ఉన్నట్లు సూచనప్రాయంగా వెల్లడికావడంతో దాంతో 324 బ్యాటరీ బస్సులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో మరో వెయ్యి బస్సులను ఎలా సర్దుబాటు చేసుకోవాలే తెలియక ఆర్టీసీ మల్లగుల్లాలు పడుతోంది.

అప్పుడు వద్దన్నారు..

గతంలో ఆర్టీసీ 324 ఎలక్ట్రిక్‌ బస్సులను చేజార్చుకుంది. ఫాస్టర్‌ అడాప్సన్‌ అండ్‌ మాన్యుఫాక్చర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) పథకం రెండో విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2019లో 324 బ్యాటరీ బస్సులను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఆర్టీసీ యాజమాన్యానికి అప్పటి ఉన్నతాధికారుల మధ్య పొంతన కుదరకపోవడంతో బ్యాటరీ బస్సులపై సందిగ్ధం నెలకొంది. కాగా, ‘ఫేమ్‌’ మొదటి విడతలో 40 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు రాష్ట్రానికి వచ్చినా వాటిని కేవలం ఎయిర్​ఫోర్టు రూట్​లో మాత్రమే నడిపారు. టికెట్​ ధర ఎక్కువ ఉండడంతో జనాలు వాటిని ఇష్టపడలేదు. అలాగే, వాటి నిర్మాణం కూడా పూర్తిగా లోఫ్లోర్​ డిజైన్​తో ఉండడంతో దూర ప్రాంతాలకు నడపడం వీలుకాక నిర్వహణ ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితుల నుంచి వాటిని బయటకు తీయడం లేదు.

కాగా, 2‌‌019లో ఫేమ్‌ –2 పథకం కింద 324 బస్సులు మంజూరు చేస్తూ కేంద్రం సమాచారమిచ్చింది. అప్పటికే మొదటి విడతలో వచ్చిన ఏసీ బస్సులకు బదులు నాన్​ ఏసీ బస్సులు కావాలని ఆర్టీసీ సూచించింది. ఆ ప్రతిపాదనకు ఢిల్లీ నుంచి ఆమోదం వచ్చినా, చివరి నిమిషంలో ఓ ఉన్నతాధికారి మళ్లీ ఏసీ బస్సులే కావాలని ప్రపోజల్​ పెట్టడంతో అధికారుల మధ్య సమన్వయ లోపంతో బ్యాటరీ బస్సుల వ్యవహారం పెండింగ్​ పడింది. ఫేమ్‌ పథకం కింద తీసుకునే బస్సులు ప్రైవేటు సంస్థ ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి రావటం కూడా ఇబ్బందులు తెచ్చి పెట్టింది. పుణేలో ఈ బస్సులు నడిపిస్తున్న మేఘా సంస్థనే రాష్ట్రంలో ఈ బస్సులను ఆర్టీసికి అద్దెకు ఇచ్చింది. ఇదే సాకుతో ఆర్టీసీ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఆ బస్సులకు టెండర్లు పిలవకపోవడం, గడువు దాటిపోవడంతో ఫేమ్‌ పథకం కేటాయింపులు కూడా రద్దయ్యాయి.

ఇప్పుడు అవసరం..

రాష్ట్రంలో ఇప్పుడు ఆర్టీసీకి 1300 బస్సులు అత్యవసరంగా కావాలి. 800 బస్సులు గడువు ముగిసిపోగా, కరోనా సమయంలో బయటకు తీయకపోవడంతో 500 బస్సులు మరమ్మతులు చేస్తున్నా మొరాయిస్తున్నాయి. దీంతో వాటిని కూడా వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫేమ్‌–2 కేటాయింపులు పూర్తిగా రద్దు కాలేదని, దానికి సంబంధించిన ఫైలు కేంద్రం వద్ద పెండింగ్​ ఉందని ఆర్టీసీ అధికారులకు సమాచారమందించారు. దీంతో మళ్లీ ఆ కేటాయింపులను పునరుద్ధరించాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బస్సులు వస్తే కొంతైనా భారం తగ్గుతుందని భావిస్తున్నారు. బ్యాటరీ బస్సుల్లో భాగంగా నాన్​ ఏసీ బస్సులకు అనుమతి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story