ముగిసిన టీఎస్ఐఐసీ భూముల వేలం

by  |
Khanamet
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖానామెట్‌లోని 14.91 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసీ ద్వారా శుక్రవారం వేలం వేయగా మొత్తం రూ.729.41 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్యధిక ధర ఎకరానికి 55 కోట్లు పలికిందని ఐటీ, పరిశ్రమల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తక్కువ ధర ఎకరానికి 43.60 కోట్లు వచ్చిందన్నారు.

ప్లాట్ నంబర్ 4లో 3.15 ఎకరాలకు రూ.48.60 కోట్ల చొప్పున మొత్తం రూ.153.09 కోట్లతో లింక్ వెల్ టెలి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకోగా, ప్లాట్ నంబర్ 6లో 3.15 ఎకరాలకు రూ.43.60 కోట్ల చొప్పున రూ.137.34 కోట్లతో అప్ టౌన్ లైఫ్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుందని తెలిపారు. ప్లాట్ నంబర్ 12 లోని 3.69 ఎకరాలకు రూ.50.40 కోట్ల చొప్పున రూ.185.98 కోట్ల తో జీవీపీఆర్ ఇంజనీర్స్, ప్లాట్ నంబర్ 14 లోని 2.92 ఎకరాలకు రూ.55 కోట్ల చొప్పున మొత్తం రూ.160.60 కోట్లతో మంజీర కన్స్ట్రాక్షన్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 17 లోని 2 ఎకరాలను రూ.46.20 కోట్ల చొప్పున మొత్తం రూ.92.40 కోట్లకు లింక్ వెల్ టెలి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుందని వివరించారు.

రెండ్రోజుల్లో వచ్చినది ఎంతంటే…

కోకాపేటలోని 8 ప్లాట్లలో 49.951 ఎకరాలను హెచ్ఎండీఏ ఈ ఆక్షన్ ద్వారా విక్రయించగా రూ.2000.37 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరగా, శుక్రవారం ఖానామెట్ లోని టీఎస్ఐఐసీ ద్వారా14.91 ఎకరాలకు నిర్వహించిన వేలంలో రూ.729.41 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. రెండ్రోజుల్లో ప్రభుత్వ భూముల విక్రయంతో రూ.2729.78కోట్ల ఆదాయం సమకూరింది.

Next Story