గతేడాది 'మార్చి బిల్లే' కట్టొచ్చు

by  |
గతేడాది మార్చి బిల్లే కట్టొచ్చు
X

– మార్చి పవర్ బిల్లులపై ఈఆర్సీ ఆర్డర్

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) మార్చి నెల విద్యుత్ బిల్లుల వసూళ్ల పద్ధతిని మార్చాయి. సాధారణంగా ఈ నెల మొదటి రెండు వారాల్లో తీయాల్సిన విద్యుత్ బిల్లుల రీడింగ్‌లు నమోదు చేయకుండానే బిల్లులు వసూలు చేయనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ఈఆర్సీ) డిస్కంలకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బిల్లుల కోసం ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌లు తీయడం ప్రస్తుతం సాధ్యమయ్యేపని కాదని, ఈ విషయంలో తాత్కాలిక మినహాయింపునివ్వాలని డిస్కంలు ఈఆర్సీని అభ్యర్థించాయి. దీంతో ఈఆర్సీ డిస్కంలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించింది. ఎవరి విద్యుత్ బిల్లు ఎంత ఉండొచ్చనే దానిని డిస్కంలు వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్ రూపంలో పంపనున్నాయి. ఆయా డిస్కంల వెబ్‌సైట్లలోనూ పెట్టనున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఎవరు ఎంత విద్యుత్ వాడారన్నది లెక్కకట్టి అందుకనుగుణంగా ఆయా విద్యుత్ బిల్లుల్లో మార్పులు చేయవచ్చని ఈఆర్సీ తన ఆర్డర్‌లో తెలిపింది.

కాగా, కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల ప్రకారం.. జనరేషన్ కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బిల్లులపైనా మారటోరియం ఉండటంతో లేట్ పేమెంట్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఈఆర్సీ ఆదేశాలిచ్చింది. కొత్త కనెక్షన్లు ఇవ్వడం, లోడ్ రివైజ్ చేయడం లాంటి అత్యవసరం కాని పనుల విషయంలోనూ వినియోగదారుల ఫిర్యాదులపై డిస్కంలకు పెనాల్టీలు ఉండవని తెలిపింది. ప్రభుత్వ లాక్ డౌన్ అమల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదేశాల్లో తెలిపింది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్ స్టేట్ ఓపెన్ యాక్సెస్ అప్లికేషన్లను సైతం అత్యవసరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని డిస్కంలకు ఊరటనిచ్చింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ ఆదేశాలను సమీక్షిస్తామని, ఇవి మధ్యంతర ఆదేశాలేనని పేర్కొంది.

ఈఆర్సీ ఆదేశాల ప్రకారం మీటర్ రీడింగ్‌లు రికార్డు కాని ఎల్‌టీ విభాగంలోని వినియోగదారులు..

(గృహ వినియోగదారులు, వీధి దీపాల కనెక్షన్లు, రక్షిత మంచి నీటి సరఫరా లాంటి పలు స్కీంల కింద ఉన్న కనెక్షన్లు..)

2019 మార్చిలో విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్న వారు 2019 ఏప్రిల్ నెలలో వచ్చిన విద్యుత్ బిల్లు మొత్తం కడితే సరిపోతుంది.
2019 ఏప్రిల్‌లో కనెక్షన్ తీసుకున్న వాళ్లు 2020 మార్చిలో వచ్చిన విద్యుత్ బిల్లు మొత్తం చెల్లించవచ్చు.
2020 మార్చిలోనే కనెక్షన్ తీసుకున్న వాళ్లు మినిమమ్ బిల్లు కట్టొచ్చు.

పైన పేర్కొన్న కనెక్షన్లు కాక మిగిలిన ఎల్‌టీ కనెక్షన్లు(వ్యవసాయ కనెక్షన్లు తప్ప)

2019 మార్చిలో విద్యుత్ కనెక్షన్ ఉన్న వారు 2019 ఏప్రిల్ బిల్లులో 50 శాతం కడితే సరిపోతుంది.
2019 ఏప్రిల్‌లో కనెక్షన్ తీసుకున్న వారు 2020 మార్చి బిల్లులో 50 శాతం చెల్లించవచ్చు.
2020 మార్చిలోనే కనెక్షన్ తీసుకున్న వాళ్లు కనీస విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు.

Tags: telangana, power bills, discoms, cerc order, corona lockdown

Next Story

Most Viewed