ఇంటి ఓనర్లూ.. అద్దె వసూళ్లొద్దు

by  |
ఇంటి ఓనర్లూ.. అద్దె వసూళ్లొద్దు
X

ఎవరినీ ఇల్లు ఖాళీ చేయించవద్దు
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
ఉల్లంఘిస్తే శిక్షలేనని హెచ్చరిక

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్నందున మార్చి నుంచి 3 నెలల పాటు ఇళ్ల అద్దెలు వసూలు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు 2005 ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఇళ్లు అద్దెకిచ్చిన ఓనర్లను ఈ మేరకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయమై రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన 3 నెలల అద్దెను తర్వాత తీసుకోవాలని ఇళ్ల యజమానులను ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది. వాయిదా వేసిన అద్దె మొత్తానికి వడ్డీ వసూలు చేయవద్దని వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు ప్రకారం శిక్షలుంటాయని పేర్కొంది. జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు ఈ ఆదేశాలను పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరింది.

రాష్ట్రంలో చాలా మంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నందున లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేక వారు అద్దెకట్టలేరని, ఆ సొమ్ము ఇతర అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉండాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. కొందరైతే తమ సంపాదనలో 40శాతం దాకా అద్దెకడుతున్న పరిస్థితులున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం అద్దెకు వెచ్చించడం కుదరదని పేర్కొంది. అంతేగాక ఇంటి యజమానులెవరు కిరాయిదారులను ఇళ్లు ఖాళీ చేయించవద్దని కోరింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఇల్లు ఖాళీ చేయిస్తే కిరాయిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపింది. ప్రజలు ఏ కారణంతో రోడ్డు మీదకు వచ్చినా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ప్రభుత్వం హెచ్చరించింది.

Tags: telangana, corona, lockdown, g.o on rental, owners, tenants, chief secretary


Next Story

Most Viewed