కేర్ లెస్.. మునిగినంక సర్కారు కదలికలు

by  |
కేర్ లెస్.. మునిగినంక సర్కారు కదలికలు
X

దిశ, న్యూస్ బ్యూరో: వర్షాకాలం రాబోతున్న తరుణంలో హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ తయారుచేయడంలో మాత్రం నిర్ల క్ష్యంగానే వ్యవహరించింది. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే ఈ విభాగం కార్యదర్శి ఏటా వేసవి కాలానికి ముందు ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్’ తయారు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో రుతు పవనాల ను దృష్టిలో పెట్టుకుని ‘మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్’ కూడా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తుపానుల ప్రమాదం తక్కువగా ఉండడంతో ఆ విధానమూ అటకెక్కింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్ల కాలంలో అనేక కొత్త సాగునీటి ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి. వాటి కింద లోతట్టు ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయి. నీటి ప్రవాహ తీరులో మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టణాల్లో కొత్త నిర్మాణాలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారీస్థాయిలో వర్షాలు కురిసినప్పుడు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు.

తాజాగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ నుంచి అతి భారీస్థాయి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర, కేంద్ర వాతావరణ శాఖలు హెచ్చరిస్తూనే వచ్చాయి. లారీ కొట్టుకుపోవడం, పన్నెండు మంది రైతులు వరద నీటిలో చిక్కుకుపోవడంలాంటి సంఘటనలు జరిగే వరకూ ప్రభుత్వ యంత్రాం గం పట్టించుకోనేలేదు.

నగరం జలమయం

తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ‘వర్షాలు కురిస్తే నగరంలోని రోడ్లు మునిగిపోతాయి. బండ్లు ఓడలవుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలోని పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పుడు భారీ వర్షాలతో వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరం కూడా నీళ్లలో తేలుతోంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి బోట్ల ద్వారా అపార్టు మెంట్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. సిరిసిల్ల లాంటి పట్టణంలో కలెక్టర్ భవనాన్ని కట్టినా అక్కడికి చేరుకునే రోడ్లన్నీ మునిగిపోవడంతో ద్వీపం తరహాలో దర్శన మి చ్చింది. ఇక ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ లాంటి జిల్లాల్లో రోడ్డు ఎక్కడ ఉందో వరద నీటిలో కనిపించే పరిస్థితి లేదు.

ముందుగా హెచ్చరించినా

గోదావరి నదిలోకి వరద నీరు ఏ స్థాయిలో వస్తుందో కేంద్ర జల సంఘం కూడా రాష్ట్రాలను హెచ్చరించింది. చిన్నపాటి వానలు కురిసి వరద వస్తేనే కొండపోచమ్మ రిజర్వాయర్ గట్టుకు గండి పడింది. అనేక చెరువు కట్టలు తెగిపోయి వరద నీరు పొలాల్లోకి వచ్చి మొలకెత్తుతున్న పంట మునిగిపోయింది. కలెక్టర్ తన పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించాలి. నీట మునిగే పరిస్థితే వస్తే ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయ చర్యలు చేపట్టడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. పునరావాస కేంద్రా లను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. అలాంటి చర్యలేమీ లేకపోవడంతో, అంతా అయిపోయాక ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఆ నిధులు ఏమయ్యాయో?

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2018-19 సంవత్సరానికి రూ. 226.50 కోట్లు, 2019-20 సంవత్సరానికి రూ. 487.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19లో రూ.302 కోట్లు, 2019-20లో రూ.100 కోట్ల చొప్పున విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు ఇస్తామని ప్రకటించింది. విపత్తు నిర్వహణ రిజ ర్వు ఫండ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధుల్లో ఏ అవసరాలకు ఎంత ఖర్చయిందో, కంటింజెన్సీ ప్రణాళిక కింద ఏయే జిల్లాలకు ఏ స్థాయిలో ప్రభుత్వం కేటాయించిందో అధికారులె వ్వరూ వివరణ ఇవ్వడానికి సుముఖంగా లేరు.

మూడు రోజులకు మేలుకుని

వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమైపోయిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పంద్రాగస్టు రోజున ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అదేశించారు. ఆ తర్వాత మాత్రమే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రుతుపవనాల సమయంలోనే తగిన కంటింజెన్సీ ప్రణాళిక రూపొందిం చుకోవాల్సిన పరిస్థితుల్లో, భారీ స్థాయిలో వర్షాలు కురిసిన మూడు రోజుల వరకూ జిల్లా అధికారులకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేకపోవడం గమనార్హం.

కేటీఆర్ ను కదిలిస్తేనే

రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారని భూపాలపల్లి ఎమ్మెల్యే ఫోన్ చేసేవరకు అధికారుల్లో చలనం లేదు. ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీని అప్రమత్తం చేసే వరకు అధికారులు కదలనే లేదు. రైతుల్ని రక్షించడానికి హెలీక్యాప్టర్ పంపాల్సిందిగా ఎమ్మల్యే నేరుగా సీఎంకు కాకుండా మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసిన తర్వాతనే కదలిక మొదలైంది. సచివాలయం కూల్చివేతకు తగిన ఫైర్ సేఫ్టీ లేదని, ఫైర్ ఇంజన్ వస్తే బ్లాకుల చుట్టూ తిరగడానికి కూడా రోడ్డు సౌకర్యం లేదని సీఎం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇలాంటి తరుణంలో జిల్లాల్లో విపత్తులు వస్తే నివారించడానికి రెస్పాన్స్ ఫోర్సులను సన్నద్ధంగా ఉంచుకోవడం, కలెక్టర్లే పరిస్థితులకు తగిన విధంగా రియాక్ట్ కావడం లాంటివి అనుకున్నంత వేగంగా జరగడంలేదని తాజా పరిస్థితి చూస్తే స్పష్టమవుతోంది.

పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ ఉండాలి: చంద్రవదన్, ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి

తెలంగాణలో కొత్తగా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. రిజర్వాయర్లు కూడా ఏర్పడ్డాయి. ముంపు ప్రాంతాలు, ఆయకట్టులో మార్పు వచ్చింది. దీనికి తగినట్లుగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో తగిన మార్పులు చేసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్‌లో అప్‌డేషన్ జరగాలి. ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుంది, ఓవర్ ఫ్లో అవుతున్నప్పుడు, గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తే అది ఎక్కడకు చేరుతుంది, అక్కడి ప్రజలను అలర్టు చేయడం ఎలా, వార్నింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి. ఇలాంటి అనేక అంశాలు ఆ ప్లాన్‌లో ఉండాలి. దాని ప్రకారం జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. ఇప్పుడు తెలంగాణలో అది కొరవడింది.



Next Story

Most Viewed