రైతులను దగా చేసిన కేంద్రం

by  |

దిశ, న్యూస్‌ బ్యూరో :
లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వలన రైతులకు ఒరిగింది ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చేసిన కేటాయింపులనే..ప్రత్యేక ప్యాకేజీలోనూ చెప్పి రైతులను మోసం చేశారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కేటాయింపులపై ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగంపై ఆమె స్పందిస్తూ శనివారం ఓ ప్రకటన చేశారు.రైతులకు రుణం అందించేందుకు అత్యవసర వర్కింగ్ కాపిటల్ నిధి అంటే ఒక్కొక్కరికి రూ. 2,542 రుణం ఇస్తారా అని ప్రశ్నించారు. ఇది రైతులను అవమాన పర్చడమేనని వివరించారు. ఇటీవల కార్పొరేట్ శక్తులకు రూ.68 వేల 607 కోట్లు మాఫీ చేసి, రైతులకు మాత్రం రూ.4వేల కోట్లు వడ్డీ సబ్సిడీ కింద ఇవ్వడమంటే ప్రభుత్వం ఎవరి పక్షం వహిస్తుందో అర్థమవుతుందన్నారు.విదేశీ కంపెనీల పెట్టుబడులను వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్తిగా మొహరించడానికి ఉద్దేశింపబడిన విధానాలను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు.విపత్కర పరిస్థితుల్లో అందరూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున రైతులు రుణాలు అందిస్తారా లేక నామమాత్రంగా ఇస్తామని ప్రకటిస్తూ చేతులు దులుపుకుంటారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతకు ముందు కరోనా సమయంలో ప్రకటించిన రూ.1.78లక్షల కోట్ల ఖర్చుల వివరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed