కోటి మంది స్వాగతిస్తారా? అహ్మదాబాద్ జనాభా ఎంత?

by  |

దిశ, వెబ్‌డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అహ్మదాబాద్‌లో తనను స్వాగతించేవారి సంఖ్య కోటి మంది ఉండొచ్చని అంచనా వేశారు. ఇటీవలే 50 లక్షల నుంచి 60 లక్షల మంది అహ్మదాబాద్‌లో తనకు స్వాగతం పలకవచ్చని చెప్పిన విషయం తెలిసిందే. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ కొత్త అంచనాలు వెల్లడించారు. అదీ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారని వివరించారు. ఇటీవలే అభిశంసన నుంచి బయటపడి.. త్వరలో అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఆయన పర్యటన మొదలు కానుంది.

నిజంగా ట్రంప్‌ను స్వాగతించేందుకు కోటి మంది ప్రజలు బారులు తీరునున్నారా? అనేదానిపై అస్పష్టతే ఉన్నది. ఎందుకంటే అహ్మదాబాద్ మొత్తం జనాభా దశాబ్దం క్రితం(2011 సెన్సస్ ప్రకారం) 55.7 లక్షలుగా ఉన్నది. ఇప్పుడు ఆ నగరం మొత్తం జనాభా సుమారు 70 లక్షలకు చేరి ఉండొచ్చని ఓ సివిక్ అధికారి అంచనా వేశారు. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీల రోడ్ షోలో భారీమొత్తంలో జనాభా వస్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ సంఖ్య రెండు లక్షలను మించకపోవచ్చునని ఓ అధికారి వెల్లడించడం గమనార్హం.

Next Story