కేసీఆర్ కొరివి దెయ్యం : రేవంత్ రెడ్డి

by  |
కేసీఆర్ కొరివి దెయ్యం : రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్​పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కొరివి దెయ్యంలా ప్రాజెక్టుల పేరుతో, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దళిత గిరిజన భూములను లాక్కొని బజార్‌లో నిలబెట్టాడన్నారు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులతో ఆడబిడలను చెట్లకు కట్టేసి హింసించి గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మంలో చంటిపిల్లలున్న ఆడబిడ్డలను కూడా జైలుకు పంపి పాశవికంగా పాలిస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని అన్నారు. ఇద్దరినీ గద్దె దించేందుకు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఏడాది పొడుగునా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని మోదీ నిరుద్యోగులను మోసం చేసారన్నారు. ఏడేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్ అయినా ఉద్యోగులే ఎక్కువ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను బలిచ్చి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారని, శాంతియుత ఉద్యమాలు నిర్వహించడంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శి అని చెప్పుకొచ్చారు. కొన్ని రాజకీయపార్టీలు మతాల మధ్య చిచ్చుపెడుతూ స్వార్ధరాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్, ఇన్​పుట్​ సబ్సిడీ, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించింది కాంగ్రెసే అని స్పష్టం చేశారు.

Next Story