గులాబీ వర్సెస్ ‘కమలం..’

by  |
గులాబీ వర్సెస్ ‘కమలం..’
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ‘‘అజయ్ కుమార్.. 2023లో అధికారం మాదే.. అప్పుడు మొదట చెప్పేది నీ సంగతే.. నీ అవినీతి అంతా బయటకు తీస్తాం.. నీ కాంట్రాక్టులు.. ఆస్పత్రి వ్యవహారం… ఎన్నెస్పీ భూముల రెగ్యులరైజేషన్.. అన్నీ తేలుస్తాం.. ఎన్ని కోట్లిచ్చి మంత్రి పదవి కొన్నావో అందరికీ తెలుసు.. బీజేపీ అనే వ్యాక్సిన్ ను మొదట ప్రయోగించేది నీ మీదే..’’
– ఖమ్మం వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

‘‘నువ్వొ బత్తాయి లాంటోడివి.. 2023 దాకా నేను ఆగలేను.. కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. నువ్వేం చేసుకుంటావో చేసుకో.. పువ్వాడ ఫ్యామిలీ గురించి ఖమ్మంలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.. మా జిల్లా ప్రజలకు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ.. అంటురోగం లాంటి పార్టీ మాకు అంటుకోదు.. నాకు వ్యాక్సిన్ ఇవ్వడం కాదు.. నీకు హైదరాబాద్‌లో నేను ఇచ్చిన వ్యాక్సిన్ గుర్తులేదా..? నువ్వో తొండి సంజయ్ వి..’’
– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఇవీ.. ఇరు పార్టీల నేతలు ఇటీవల ఒకరిపై ఒకరు సంధించుకున్న వాగ్భాణాలు.. దీంతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ హవానే కొనసాగుతుండగా.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాకతో బీజేపీ ఫాంలోకి వచ్చినట్లయింది. ఇరు నేతల మాటలతో రెండు పార్టీలు రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇటీవల ఖమ్మం వచ్చిన బండి సంజయ్ కేవలం మంత్రి పువ్వాడనే ఫోకస్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతే ప్రధాన అస్త్రంగా తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ‘బండి’కి ధీటుగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ధ్వజమెత్తడంతో రెండు పార్టీల్లో కాక మొదలైంది.. గతంలో ఖమ్మంలో కాస్తో కూస్తో కాంగ్రెస్ మాట వినపడినా ఇప్పుడు ‘గులాబీ’ వర్సెస్ ‘కమలం’గా మారే పరిస్థితి ఏర్పడింది.

నోటిఫికేషన్ రాకముందే..

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు నోటిఫికేషన్ రాకముందు నుంచే అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే గులాబీ, కమలం పార్టీలు ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతున్నాయి. పోయినసారి ఎన్నికలు జరిగిన ఖమ్మం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 34 టీఆర్ఎస్ గెలుచుకోగా.. ఏడుగురు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు వైసీపీ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సారి 60 డివిజన్లకు ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎలాగైనా పీఠాన్ని మళ్లీ దక్కించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే.., గ్రేటర్ జోష్ మీదున్న బీజేపీ సైతం ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం ఎలాగైనా సాధ్యమైనన్ని స్థానాలు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ప్రత్యర్థి పార్టీ బీజేపీయే?

ఐదేండ్ల క్రితం ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజయ్ కుమార్ ఒక్కరే గెలిచారు. అప్పుడు ఈ రెండు పార్టీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం గులాబీ గుమ్మంగా మారింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలందరూ ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ ఖమ్మంను అభివృద్ధి బాట పట్టించారు. కానీ ఇప్పుడు వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ జిల్లాలో నామ మాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో కేడర్ లేనేలేదు. కానీ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. త్వరలో జరిగే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలపైనే ప్రధానంగా బీజేపీ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఇటీవల బండి సంజయ్ పర్యటన, మంత్రిపై తన విమర్శలతో జిల్లాలో కమలం పార్టీ ఒక్కసారిగా పుంజుకున్నట్లయింది. మంత్రి అజయ్ మాత్రం బీజేపీ అంటురోగం పార్టీ అని.. అసలు లెక్కలోకి తీసుకోమని.. కాంగ్రెస్సే జిల్లాలో తమకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పారు. కానీ జిల్లాలో పరిస్థితులను చూస్తుంటే రాబోయే అన్ని ఎన్నికల్లో కమలానికి, గులాబీకి మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story

Most Viewed