రాజధాని ఎమ్మెల్సీకి టీఆర్ఎస్ దూరం..?

by  |
రాజధాని ఎమ్మెల్సీకి టీఆర్ఎస్ దూరం..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తమ అభ్యర్థిని నిలిపే విషయంలో టీఆర్ఎస్ పార్టీ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు కలసిరాని ఈ స్థానం నుంచి పోటీ చేసి అభాసుపాలు కావడం కంటే అభ్యర్థిని నిలువకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పార్టీకి కాస్త నష్టం కలిగినా బీజేపీ దూకుడుకు కళ్లెం వేయవచ్చని, వామపక్షాల అభ్యర్థిగా రంగంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతునిచ్చి గెలిపించుకుంటే కొంత గౌరవమైనా దక్కుతుందనే భావనతో ఉన్నట్టు సమాచారం.

నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానానికి 18 రోజుల కిందటే సిట్టింగ్​ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంత్రులు. ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయన గెలుపు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పల్లా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులలోనే నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించినా ఓటర్లను మెప్పించడం కష్టమే.

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో నిర్ణయం

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పార్టీ అభ్యర్థి నిలిపేందుకు కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. అభ్యర్థి గెలుపు కోసం ఎలాగైనా కృషి చేయాలని, ఓటరు నమోదు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అన్ని మండలాలు. పట్టణాల్లో టీఆర్​ఎస్​ నాయకులు దగ్గరుండి మరి నమోదు ప్రక్రియ నిర్వహించారు. బరిలో నిలపడానికి కొందరు ఆశావహుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టు సమాచారం. మూడు జిల్లాల నుంచి రెండు మూడు దఫాలుగా అభ్యర్థి గెలుపోటములపై రహస్య నివేదికలు సేకరిస్తే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులున్నాయని తేలినట్టు సమాచారం. అదే సమయంలో బీజేపీ కాస్త బలం పుంజుకుందని కూడా తెలియడంతో అభ్యర్థిని దించడం కన్నా వామపక్షాల అభ్యర్థికి మద్దతివ్వడమే మంచిదని నిర్ణయించినట్లు సమాచారం.

బలం చేకూరుస్తున్న ప్రసంగాలు

వామపక్షాల అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయా సమావేశాలలో చేస్తున్న ప్రసంగాలు టీఆర్ఎస్ తనకు మద్దతు ఇస్తుందన్న సంకేతాలను ఇస్తున్నాయి. నేరుగా చెప్పకుండా ‘‘ప్రధాని వచ్చి నీకు ఓటు వేస్తామన్నా వేయించుకుంటాము. మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం’’ అని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలతోనే టీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ అభ్యర్థిని నిలపకుండా, బీజేపీ అభ్యర్థి గెలవకుండా వామపక్ష పార్టీల క్యాండిడేట్​ను గెలిపించుకోవడంతో కాస్త పరువు కాపాడుకునే అవకాశం ఉంటుందని టీఆర్​ఎస్​ ఆలోచిస్తోందని అంటున్నారు. ఒకటి, రెండు రోజులలో ఈ విషయమై స్పష్టత రావొచ్చని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Next Story

Most Viewed