ఈసారి టీఆర్ఎస్ ప్లీనరీ ప్లాన్ ప్రశ్నార్థకమేనా..?

by  |
ఈసారి టీఆర్ఎస్ ప్లీనరీ ప్లాన్ ప్రశ్నార్థకమేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ జరగడం ఆనవాయితీ. ఈ వేదికగా పార్టీ శ్రేణులకు అధినేతగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తుంటారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వాల నమోదు ముమ్మరంగా నిర్వహించడం లాంటి అనేక అంశాలపై యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారు. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం ఇచ్చిన హామీల అమలు, పార్టీ చిత్తశుద్ధి కార్యాచరణ తదితరాలను కూడా ప్రస్తావిస్తుంటారు. అయితే గత రెండేళ్లుగా ప్లీనరీ జరగడంలేదు. ఈసారి గ్రాండ్‌గా జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ ఉనికిలోకి వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా జరిగేలా పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కనీసం లక్ష మందితో భారీ స్థాయి బహిరంగ సభను నిర్వహించుకుందామని, తగిన వేదిక ఎక్కడ బాగుంటుందో ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులకు సూచించారు.

కానీ, ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వరుసగా రెండేళ్ళ నుంచి జరగని ప్లీనరీ ఈసారి గొప్పగా జరపాలనుకున్నా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. పార్టీ వర్గాలు స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించకపోయినా ప్లీనరీ ఏర్పాట్ల గురించి మాత్రం ఇంకా ఎలాంటి కదలిక మొదలుకాలేదు. 2019లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ప్లీనరీని పార్టీ నిర్వహించలేకపోయింది. గతేడాది కరోనా కారణంగా వాయిదా వేసుకుంది. ఈసారి కూడా కరోనా కారణంగానే వాయిదా దిశగా అడుగులు పడుతున్నాయి. ఎలాగూ ఈ నెల 30వ తేదీ వరకు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు.. లాంటివాటికి పర్మిషన్లు లేవంటూ ప్రభుత్వమే జీవో జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి కూడా అదే జీవో వర్తించనున్నందున వరుసగా మూడో సంవత్సరం కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కరోనా కారణంగా మార్చి నెల నుంచే విద్యా సంస్థలను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశించింది. కరోనా కేసులు రాష్ర్టంలో రోజురోజుకూ పెరుగుతున్నందున సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్‌లో గో మహాగర్జన సభకు సైతం తొలుత అనుమతి ఇచ్చి ఆంక్షల నేపథ్యంలో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పోలీసులు సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. చివరకు కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతితో పరిమిత సంఖ్యలో జరిగింది. ఖమ్మం పట్టణంలో వైఎస్ షర్మిల నిర్వహించే సభకు సైతం పోలీసులు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించొద్దని పార్టీ అధిష్టానం భావిస్తోంది.



Next Story

Most Viewed