రేపే టీఆర్ఎస్ ‘ప్లీనరీ’.. కదలనున్న గులాబీ దండు

by  |
రేపే టీఆర్ఎస్ ‘ప్లీనరీ’.. కదలనున్న గులాబీ దండు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్లీనరీ కోసం టీఆర్ఎస్ అధిష్టానం భారీ ఏర్పాట్లు చేసింది. 6 వేలకు పైగా ప్రతినిధులతో 3 ఎకరాల సభాప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.వాహనాల పార్కింగ్ కోసం 50 ఎకరాలను సిద్ధం చేసింది. అంతేకాదు ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన 2 వేల చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రతినిధుల పేర్ల నమోదులో ఇబ్బందులు పడకుండా 35 కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 29 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం సన్నద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదిగా ఈ నెల 25న ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు చేసింది. కోట ద్వారాన్ని తలపించేలా భారీ ప్రవేశ మార్గం.. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కళాతోరణం, దుర్గం చెరువు థీమ్‌తో ఎల్‌ఈడీ ధగధగలు.. కండ్లకు కట్టేలా వేలాది ఫొటోలతో ఉద్యమ సారథి జీవిత చరిత్ర.. ఏడేండ్ల పాలనలోని అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తుంది పార్టీ అధినాయకత్వం. 2వేల ఫొటోలను ఎగ్జిబిషన్ లో ఉంచనున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. వేదికపై సీఎం కేసీఆర్, మంత్రులు మాత్రమే కూర్చోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు మాజీ ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పోలీసులు, మీడియా ప్రతినిధులకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఒకేసారి 3 వేల మంది భోజనం చేసేలా ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చే ప్రతినిధుల వాహనాలను నిలిపేందుకు సభా ప్రాంగనానికి ఇరువైపులా 50 ఎకరాలను సిద్ధం చేశారు.

ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల పేర్ల నమోదు కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకే చేరుకునేలా మార్గనిర్దేశనం చేయడంతో పాటు ఇప్పటికే పాసులు అందజేశారు. ప్రతినిధులంతా గులాబీ డ్రస్ ధరించి వచ్చేలా ఆదేశాలు సైతం జారీ చేశారు. తెలంగాణ వంటకాలను ప్రతిబింబించేలా 29 రకాల వంటలను తయారు చేయిస్తున్నారు. వాహనడ్రైవర్లు తదితరులు భోజనం చేసేందుకు హైటెక్స్ సమీపంలో 4 వేల మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో భారీ ప్రవేశ ద్వారం, వేలాది ఫొటోలతో ఉద్యమ నాయకుడి జీవిత చరిత్ర, ఏడేండ్ల పాలన, అభివృద్ధిపై ఫొటో ఎగ్జిబిషన్‌, 36 అడుగుల ఎత్తుతో సీఎం కేసీఆర్‌ కటౌట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

‘గులాబీ జెండా కేసీఆర్’ పాట ఆవిష్కరణ

టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో రూపొందించిన పాటల సీడీని శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ‘గులాబీ జెండా కేసీఆర్’ అనే పాట ఆడియో సీడీని రూపొందించారు. పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాములు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed