చివరకు బంధుత్వమే గెలిచింది… కమలానికి బై… గులాబీకి జై

by  |
చివరకు బంధుత్వమే గెలిచింది… కమలానికి బై… గులాబీకి జై
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయలతో ఆపరేషన్ మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ మరో నాయకున్ని ఈటలకు దూరం చేయడంలో సక్సెస్ అయింది. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో రాయబారం చేయించిన అధినేత కేసీఆర్.. ఎట్టకేలకు ఆ నాయకున్ని తిరిగి సొంత పార్టీలో చేర్పించుకోవడంలో సఫలం అయ్యారు. ఈటల వెన్నంటే నడిచిన జమ్మికుంట మునిసిపల్ వైస్ ఛైర్మన్ దేశిని స్వప్న, ఆమె భర్త, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ కోటిలు తిరిగి టీఆర్ఎస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు. కారు గుర్తుపై గెల్చిన తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, ఇక్కడ జరుగుతున్న అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనతోనే బీజేపీని వీడి టీఆర్ఎస్ పంచన చేరుతున్నామని స్వప్న, కోటిలు వెల్డడించారు. ఇక నుండి తాము ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు.

బంధుత్వ రాయబారం..

రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లిలో ఉన్న దేశిని కోటి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరిపారు. కోటి సోదరి, మంత్రి శ్రీనివాస్ సోదరి కుటుంంబాల మధ్య బంధుత్వం ఉంది. తమ కుటుంబాల మధ్య ఉన్న బందుత్వం కారణంగానే మంత్రి తమ ఇంటికి వచ్చారని చెప్పినప్పటికీ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఈటల అనుచరుడు కోటిల మధ్య జరిగిన చర్యలు మాత్రం పార్టీ ఫిరాయింపు గురించేనని ఇప్పటికే ’దిశ‘ వెలుగులోకి తెచ్చింది. టీఆర్ఎస్‌లోకి రీ ఎంట్రి ఇవ్వాలని మంత్రి కోటి దంపతుల ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే తాము ఈటలకు మాట ఇచ్చామని, టీఆర్ఎస్‌లో చేరేది లేదని మంత్రితో వ్యాఖ్యనించారు. అయితే ఆ తరువాత బంధువుల ద్వారా ఒత్తిడి చేయడంతో కోటి దంపతులు తిరిగి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.


Next Story

Most Viewed