హుజురాబాద్‌‌లో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ ప్లాన్

by  |
హుజురాబాద్‌‌లో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ ప్లాన్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్‌లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా సాగుతోంది. బలమైన ఈటలను ఓడించేందుకు భారీ స్కెచ్‌లతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకున్న టీఆర్ఎస్ నాయకులు 70 శాతం మందిని అనుకూలంగా మల్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగబోతున్నారు. ఇప్పటి వరకు సామాజిక వర్గాలు, వృత్తుల వారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు ఇక నుంచి విలేజ్ యూనిట్‌గా చేసుకుని ప్రచారం చేయనున్నారు. ఓటర్లను నేరుగా కలవడం టీఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రత్యక్ష్యంగా వివరించాలని నిర్ణయించారు. దుబ్బాక ఎన్నికల తరహాలోనే మొదటగా ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జీని నియమించారు. ఈ వంద మంది ఓటర్లను పార్టీకి అనుకూలంగా మారేందుకు ఇన్‌చార్జీలు ప్రచారాన్ని విస్తృతంగా చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు.

అవే టార్గెట్..

ముందుగా ఈటలకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈటల సొంత మండలం కమలాపూర్‌లో బాల్క సుమన్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. మంత్రి హరీష్ రావు కూడా మానిటరింగ్ చేస్తూ అక్కడ రాజేందర్ ప్రభావం తగ్గేందుకు అవసరమైన ఎత్తుగడలు చేపట్టారు. ఇంకా జనాల్లోకి వెళ్లి మరింత బలపడేందుకు అవసరమైన వ్యూహం రచించబోతున్నారు. ఐదు మండలాల్లోనూ ఈటల ప్రభావం ఉన్న గ్రామాలను గుర్తించి ఫస్ట్ స్కెచ్ అక్కడి నుండే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.



Next Story

Most Viewed