అసంతృప్తుల కోసం టీఆరెస్ భారీ స్కెచ్..

by  |
అసంతృప్తుల కోసం టీఆరెస్ భారీ స్కెచ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది. బీజేపీకి తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసేందుకు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. దుబ్బాక ఎన్నికల్లో దూకుడు మీద ఉన్న బీజేపీలోకి వలసలకు వీల్లేకుండా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అసంతృప్తులను కూడా ఆ పార్టీలో చేరకుండా నియంత్రించేందుకు రంగంలోకి దిగింది. అందుకే అభ్యర్ధుల జాబితాను ఆచితూచి ప్రకటించనుంది. ఇప్పటికే ఎక్కువ మందికి టికెట్లు ఇస్తారని పార్టీ తేల్చేసింది. ఐతే కేవలం 25 డివిజన్లలో మాత్రం కొత్త అభ్యర్ధులకు చోటు ఇస్తున్నట్లు సమాచారం. అందుకే మొదటి జాబితాలో సిట్టింగుల పేర్లను ప్రకటించనుంది. ఇంకొన్ని డివిజన్లను పెండింగులోనే ఉంచనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు టికెట్లు దక్కకపోతే బీజేపీలోకి దూకే ప్రమాదం ఉందని గుర్తించారు. అందుకే వారిని ఆశల పల్లకీలోనే ఉంచనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు పార్టీ మారకుండా చూస్తున్నారు. బీజేపీ నుంచి వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రెండో జాబితాగా కొత్త అభ్యర్ధులను ప్రకటించనున్నారు. ఇప్పటికే కొత్త అభ్యర్ధుల పేర్లను సిద్ధం చేశారు. వాళ్లకు కూడా టికెట్టు ఇచ్చినట్లేనని సమాచారం ఇచ్చారు. నేటి రాత్రికి తొలి జాబితాను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేయనుంది.

ఎమ్మెల్యేలదే ఫైనల్..

బల్దియాలో టికెట్ల కేటాయింపు ప్రక్రియలో ఎమ్మెల్యేలదే నిర్ణయమే ఫైనల్ గా కనిపిస్తోంది. చాలా రోజులుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా విడిపోయారు. గడిచిన రెండు నెలలుగా మాత్రమే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చుట్టూ కార్పొరేటర్లు తిరుగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఏదైనా కార్యక్రమానికి హాజరైతే కార్పొరేటర్లు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని డివిజన్లలో ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు తరచూ మంత్రి రావడాన్ని కూడా సహించలేకపోయారు. తాము కార్పొరేటర్లుగా ఉనికిని కాపాడుకోలేకపోతున్నట్లు బాధ పడ్డారు. ఇప్పుడేమో పార్టీ అధిష్ఠానం వారి నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చారు. పైగా ఎవరికైతే టికెట్లు కేటాయిస్తున్నారో గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలపైనే పడింది. ఇప్పటికే ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అంబర్ పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, గోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగులకు మొండి చేయి చూపే అవకాశం కనిపిస్తున్నది. వారందరినీ కాపాడుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎత్తుగడ వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వొద్దని ఆపసోపాలు పడుతోంది.


Next Story

Most Viewed