కేసీఆర్‌ను అదునుచూసి దెబ్బకొడుతున్న టీఆర్ఎస్ నేతలు

by  |
కేసీఆర్‌ను అదునుచూసి దెబ్బకొడుతున్న టీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ తన రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతీసారి ఫీనిక్స్ పక్షిలా పైకి లేచేవారు. తనని తక్కువ అంచనా వేసే రాజకీయ ప్రత్యర్ధుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి కేసీఆర్ లో‌ ‌‌ “బేలతనం, బ్రతిమలాడుకోవవడం, ఆవేశపు స్థానంలో ఆలోచనలు” స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ కారుకు ఎదురేలేదనుకున్న పరిస్థితి నుంచి ఎదురీదుతున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వెరసీ కారు టైర్ పంక్చర్ అవుతుందన్న భయం అక్కడ కనిపిస్తోంది. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ నేతలు అదును చూసి కేసీఆర్‌ను దెబ్బకొడుతున్నారు.

రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన ముఖ్యనేతలే క్యూకట్టారు. కానీ ఆ నేతలకు టీఆర్ఎస్‌లో పప్పులుడకలేదు. కుటుంబ పాలనతో తన రాజకీయ సామ్రాజ్యాన్ని నెట్టుకొస్తున్న గులాబీబాస్ తీరుపై పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సందర్భానుసారం అధినేతపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేవారికి చెక్ పెట్టేందుకు పలువురు నేతల్ని అవినీతి పేరుతో పదవుల నుంచి తొలగించడం, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడంతో పాటు, ఏ ఆశచూపి పార్టీలో చేర్చుకున్నారో.. ఆ ఆశ మళ్లీ కలగకుండా కేసీఆర్ తన స్ట్రాటజీతో కంగుతినిపించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. టీఆర్ఎస్ లో ఉండలేక, ఇతర పార్టీల హవా లేకపోవడంతో అసంతృప్తి నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక పిల్లలా తయారైంది.

అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్‌కు జిందాబాద్ కొట్టి పక్కదులిపేసుకొని పక్కకి వెళ్లిపోదామనుకుంటున్న నేతలు, ఆశల పల్లకిలో ఊగిపోతున్నారు. జమిలి లేదంటే ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా అసంతృప్తి నేతల్ని అక్కున చేర్చుకుంటున్న బీజేపీతో టచ్ లో‌ ఉంటున్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ పై చెలరేగిపోతామని హామీ ఇస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్. దీనికి తోడు బీజేపీ అధిష్టానం ఉత్తరాదిన కన్నేయడంతో వాళ్ల పని సులవైంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు బైపోల్, పట్టుభద్రుల ఎన్నికలు ముగిసే నాటికి టీఆర్ఎస్ లో 30మందికి పైగా నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతుంటే గులాబీ బాస్ ప్రజల్లో పార్టీ పరువును కాపాడేందుకు అభివృద్ధి మంత్రాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. వరద సాయం, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాల నోటిఫికేషన్లతో ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. మరి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారో తెలియాలంటే మరికొద్దికాలం ఎదురుచూడాల్సిందే.


Next Story

Most Viewed